బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 1 నవంబరు 2022 (22:37 IST)

పాలీ టెక్ ఫెస్ట్ 2022 పోస్టర్‌ను ఆవిష్కరించిన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి

Buggana
విద్యార్థులలో అంతర్లీనంగా ఉన్న సృజనాత్మకతను వెలికితీసి, వినూత్నఆలోచనలకు ఒక రూపును అందించే క్రమంలో పాలీ టెక్ ఫెస్ట్ 2022ను నిర్వహిస్తున్నామని రాష్ట్ర ఆర్ధిక, వాణిజ్య పన్నులు, నైపుణ్యాభివృద్ది, శిక్షణ శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి అన్నారు. మంగళవారం సచివాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పాలీ టెక్ ఫెస్ట్ 2022 పోస్టర్‌ను మంత్రి ఆవిష్కరించారు.
 
ఈ సందర్భంగా మంత్రి రాజేంద్రనాధ్ రెడ్డి మాట్లాడుతూ విజయవాడలో నవంబర్ 24 నుండి 26 వరకు మూడు రోజుల పాటు ఈ రాష్ట్ర స్ధాయి కార్యక్రమం జరగనుందని, అన్ని జిల్లాలలోని పాలిటెక్నిక్ విద్యార్ధులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారని వివరించారు. ప్రతి రెండేళ్లకోసారి టెక్ ఫెస్ట్ నిర్వహించడం ఆనవాయితీగా ఉండగా, కరోనా కారణంగా 2020లో నిర్వహించబడలేదన్నారు. సాంకేతిక విద్యాశాఖ సంచాలకురాలు చదలవాడ నాగరాణి మాట్లాడుతూ వార్షిక టెక్నికల్ ఫెస్ట్ విద్యార్థుల భవిష్యత్తుకు మార్గం చూపుతుందన్నారు.
 
కార్యక్రమం ద్వారా తమవద్ద ఉన్న సమాచారం, నైపుణ్యత, సాంకేతికతలను మార్పిడి చేసుకోగలుగుతారన్నారు. ఈ సంవత్సరం టెక్ ఫెస్ట్ లో 84 ప్రభుత్వ, 173 ప్రైవేట్ పాలిటెక్నిక్‌లు పాల్గొననుండగా, రాష్ట్ర స్థాయి కార్యక్రమానికి ముందు జిల్లా స్ధాయిలో కూడా నిర్వహిస్తామన్నారు. మూడు రోజుల కార్యక్రమంలో 800 పైగా సృజనాత్మక ప్రాజెక్ట్‌లు ప్రదర్శించబడతాయని అంచనా వేసామని చదలవాడ నాగరాణి పేర్కొన్నారు.
 
విద్యార్ధులను ప్రోత్సహించే క్రమంలో రాష్ట్ర స్థాయిలో తొలి మూడు స్ధానాలు దక్కించుకున్నవారికి లక్ష, యాభైవేలు, ఇరవై ఐదువేల నగదు బహుమతులు, జిల్లా స్ధాయిలో 25 వేలు, 15 వేలు నగదు బహుమతులు అందిస్తారన్నారు. కార్యక్రమంలో  సాంకేతిక విద్యా శాఖ సంయిక్త సంచాలకులు పద్మారావు, ఎస్‌బిటిఇటి కార్యదర్శి కె విజయ బాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.