గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 1 నవంబరు 2022 (16:24 IST)

ఏపీ ప్రభుత్వానికి షాకిచ్చిన హైకోర్టు - యధావిధిగా పాదయాత్రకు ఓకే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు తేరుకోలేని షాకిచ్చింది. గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకే యాత్ర సాగాలని తాజాగా తీర్పునిచ్చింది. అదేసమయంలో పాదయాత్రపై రైతులు, ప్రభుత్వం తరపున దాఖలైన అన్ని పిటీషన్లను కొట్టివేసింది. రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని పోలీసు శాఖకు ఆదేశించింది. రైతులు కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే మాత్రం తమను ఆశ్రయించాలని పోలీసులకు సూచించింది. 
 
నవ్యాంధ్రకు అమరావతినే రాజధానిగా ఉంచాలన్న ఏకైక లక్ష్యంతో రాజధాని నిర్మాణం కోసం భూమిలిచ్చిన రైతులు అమరావతి నుంచి అరసవెల్లి వరకు పాదయాత్రను చేపట్టారు. అయితే, ఈ పాదయాత్ర డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నిలిచిపోయింది. గుర్తింపు కార్డులు చూపాలంటూ రైతులను పోలీసులు నిలువరించడంతో ఈ యాత్ర ఆగిపోయింది. 
 
ఈ క్రమంలో యాత్రను నిలిపివేయాలంటూ రాష్ట్ర ప్రబుత్వం, యాత్రలో పాలుపంచుకునేవారికి మరిన్ని వెసులుబాట్లు కల్పించాలంటూ అమరావతి రైతులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లను కలిపి మంగళవారం విచారణ చేపట్టిన హైకోర్టు తీర్పును కూడా తక్షణం వెలువరించింది. 
 
అమరావతి రైతుల పాదయాత్రను నిలుపుదల చేయాలన్న ప్రభుత్వ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. అంతేకాకుండా, యాత్రలో పాలుపుంచుకునేవారికి మరిన్ని వెసులుబాటు కల్పించాలన్న రైతుల పిటిషన్‌ను కూడా కోర్టు కొట్టివేసింది. పాదయాత్రకు సంబంధించి కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగానే యాత్ర కొనసాగాలని కోర్టు తేల్చి చెప్పింది. అంతేకాకుండా గుర్తింపు కార్డులు ఉన్న రైతులు మాత్రమే యాత్రలో పాల్గొనాలని కోర్టు స్పష్టం చేసింది.