1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 జూన్ 2021 (18:50 IST)

థర్డ్ డిగ్రీ ప్రయోగించారు... ఎంపీలకు ఆర్ఆర్ఆర్ లేఖ : లీక్ చేసిన మాణిక్యం

ఏపీలోని అధికార వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు తన అరెస్టు, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలపై లోక్‌సభ, రాజ్యసభ్యులందరికీ లేఖలు రాశారు. వైకాపాకు చెందిన ఎంపీలకు మినహా మిగిలిన సభ్యులందరికీ లేఖ రాశారు. ఈ లేఖ చూసిన ఎంపీలంతా విస్మయం వ్యక్తం చేశారు. పైగా, రాబోయే పార్లమెంట్‌ సమావేశాల్లో పార్టీలకు అతీతంగా తనకు మద్దతివ్వాలని లేఖలో కోరారు. 
 
ఎంపీలకు రఘురామ రాజు రాసిన లేఖలో దేశంలో తొలిసారి ఓ ఎంపీపై పోలీసులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారని తెలిపారు. జగన్‌ ప్రభుత్వానిది హిట్లర్‌ పాలనగా కాంగ్రెస్‌ ఎంపీ మానిక్కం ఠాగూర్‌ అభివర్ణించారు. రఘురామ లేఖను ట్విటర్‌లో ఠాగూర్‌ పోస్ట్‌ చేశారు. రఘురామపై పోలీసుల దాడిని ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉందని పలువురు ఎంపీలు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. 
 
మరోవైపు, బుధవారం రాత్రి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కూడా ఆయన కలిసి తన పట్ల ఏపీ సీఐడీ పోలీసులు ప్రవర్తించిన తీరును వివరించారు. అక్రమాస్తుల కేసులో ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని తాను సీబీఐ కోర్టులో పిటిషన్‌ వేశానన్న కక్షతోనే తనపై అక్రమ కేసులు బనాయించారని రఘురామ ఫిర్యాదు చేశారు. 
 
వీరిద్దరి మధ్య దాదాపు అర్థ గంట సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తనపై పెట్టిన రాజద్రోహం కేసు, తదనంతర పరిస్థితులన్నీ వివరిస్తూ వినతిపత్రం సమర్పించారు. తన కేసులో సీఎం జగన్‌రెడ్డి, డీజీపీ, సీఐడీ ఏడీజీ సునీల్‌కుమార్‌, ఏఎస్పీ విజయ్‌పాల్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, ఎంపీలకు రాసిన లేఖలపై స్పందించడానికి రఘురామనిరాకరించారు.