బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 26 మార్చి 2023 (08:55 IST)

నీట్ ప్రవేశ పరీక్షకు 17 యేళ్లు నిండాల్సిందే.. ఏపీ హైకోర్టు స్పష్టత

aphighcourt
వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) హాజరయ్యే అభ్యర్థులకు ప్రవేశం పొందిన ఏడాది డిసెంబరు 31 నాటికి కనీసం 17 ఏళ్లు నిండి ఉండాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు తేల్చిచెప్పింది. ఇప్పటికే ఈ వ్యవహారంపై ఉమ్మడి హైకోర్టు స్పష్టత ఇచ్చిందని, కనీస వయసును 17 ఏళ్లుగా నిర్ణయించడం సమానత్వ హక్కును నిరాకరించినట్లు కాదని పేర్కొందని గుర్తు చేసింది. 
 
ఈ నిబంధనను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యం విషయంలో జోక్యం చేసుకోలేమని పేర్కొంటూ పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత కుమార్ మిశ్రా, జస్టిస్ ఆర్.రఘునందనరావుతో కూడిన ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు ఇచ్చింది. నీట్ రాసే అభ్యర్థులకు అడ్మిషన్ పొందే ఏడాది డిసెంబరు 31 నాటికి కనీసం 17 ఏళ్లు నిండి ఉండాలని నేషనల్ మెడికల్ కౌన్సిల్ విధించిన నిబంధనను సవాల్ చేస్తూ కడపకు చెందిన 16 యేళ్ల బాలిక హైకోర్టును ఆశ్రయించారు. 
 
పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ... బాలిక వయసు 4 రోజులు మాత్రమే తగ్గుతోందని, నీట్ రాసేందుకు అనుమతించాలని అభ్యర్థించారు. మెడికల్ కౌన్సిల్ విధించిన నిబంధన రాజ్యాంగం ప్రసాదించిన సమానత్వ హక్కును ఉల్లంఘించేదిగా ఉందన్నారు. ఎన్ఎంసీ తరపున న్యాయవాది వివేక్ చంద్రశేఖర్, కేంద్ర ప్రభుత్వం తరపున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ హరినాథ్ వాదనలు వినిపించారు.