గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శనివారం, 11 మే 2019 (10:51 IST)

డాక్టర్ లేదని నర్సు డెలీవరీ చేసింది.. అంతే పసికందు ప్రాణాలు?

సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువు అదృశ్యమైన సంఘటనను మరువక ముందే మరో శిశువు ప్రాణాలు కోల్పోయింది. సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి శిశువుకు పచ్చకామెర్లు వచ్చాయని తల్లిదండ్రులు తీసుకెళ్తే.. శిశువు అదృశ్యమైన ఘటన గురించి తెలిసిందే.


ఈ నేపథ్యంలో తొమ్మిది నెలల పాటు చిన్నారిని మోసిన ఆ తల్లికి ఆసుపత్రి సిబ్బంది కడుపుకోతను మిగిల్చారు. డాక్టర్ లేకపోవడంతో నార్మల్ డెలివరీ చేయించబోయారు. అయితే ఈ వైద్యం వికటించి పిల్లాడు పురిట్లోనే మృతి చెందిన ఘటన తెలంగాణలోని నిజామాబాద్‌లో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లాలోని కమ్మర్ పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం రేణుక అనే మహిళ మూడో కాన్పు కోసం చేరింది. నొప్పులు రావడంతో డాక్టర్‌ని పిలిచారు. కానీ డాక్టర్ అంబికా రెండ్రోజులుగా అందుబాటులో లేకపోవడంతో నర్సు జ్యోతి తాను డెలివరీ చేయిస్తానని చెప్పింది. అనంతరం నార్మల్ డెలివరీ పూర్తయ్యాక కొద్దిసేపటికే బాలుడు మృతి చెందాడు. అయితే ఈ విషయాన్ని జ్యోతి దాచిపెట్టింది. చిన్నారి ఆరోగ్యం బాగోలేదనీ, పక్కనే ఉన్న మెట్ పల్లిలోని మరో ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించింది.
 
బాబును మెట్ పల్లిలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా, అప్పటికే బాలుడు చనిపోయినట్లు అక్కడి వైద్యులు నిర్ధారించారు. డెలివరీ సందర్భంగా జరిగిన పొరపాటు కారణంగానే ఈ ఘటన చోటుచేసుకుందని తేల్చిచెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.