గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 1 జులై 2020 (09:51 IST)

దయచేసి అర్థం చేసుకోండి... ఆంక్షలు కొనసాగుతాయ్ : గౌతం సవాంగ్

ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే వారికి ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ ఓ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీకి ఎవ్వరూ రావొద్దని, దయచేసి పరిస్థితిని అర్థం చేసుకోవాలని ఆయన ప్రాధేయపడ్డారు. 
 
హైదరాబాద్ నగరంలో లాక్డౌన్ విధించనున్నారనే వార్తల నేపథ్యంలో అనేక మంది ఏపీ వాసులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి క్యూ కట్టారు. దీనిపై ఏపీ డీజీపీ స్పందిస్తూ, ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వారిని ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకూ మాత్రమే అనుమతిస్తామని, ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకుని సహకరించాలన్నారు. 
 
ఏపీకి వచ్చే వారిపై ఆంక్షలు కొనసాగుతాయని, సరిహద్దుల్లో చెక్ పోస్టుల వద్ద థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతనే రాష్ట్రంలోకి అనుమతిస్తామన్నారు. ఏపీకి వచ్చే వారు స్పందన పోర్టల్ ద్వారా అనుమతి తీసుకుని పాస్ పొందిన తర్వాతనే రావాలని సూచించారు. 
 
ఈ పాస్‌లు ఉన్నప్పటికీ రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల వరకూ అనుమతించబోమని స్పష్టం చేసిన ఆయన, రాత్రి పూట అత్యవసర, నిత్యావసర సేవలకు మాత్రం అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. ఏపీలోకి రావాలనుకుంటే ఈ పాస్ ద్వారా ఖచ్చితంగా అనుమతి పొందాల్సిందేనని చెప్పారు.