శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 17 జూన్ 2021 (23:01 IST)

ఏ ఒక్క పాఠశాల మూతపడదు: మంత్రి ఆదిమూలపు

రాష్ట్రంలో జాతీయ విద్యా విధానం 2020(ఎన్ఈపీ) అమలులో భాగంగా జాతీయ విద్యా విధానంలో అపోహాలను నమ్మొద్డని, ఏ ఒక్క పాఠశాల మూతపడదని, ఒక్క ఉపాధ్యాయ పోస్టు కూడా రద్దు కాదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు.

2021-22 విద్యా సంవత్సరం నుంచి జాతీయ విద్యా విధానం 2020 అమలు చేయనున్నామని, ఈ విప్లవాత్మక సంస్కరణలను విజయవంతం చేసే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని తెలిపారు. కొవిడ్ తో మృతి చెందిన ఉపాధ్యాయుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. పాఠశాలలకు క్రీడా మైదానాలు లేనిచోట్ల భూములు కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

సచివాలయంలో జాతీయ విద్యా విధానంపై ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయ సేకరణ కార్యక్రమం గురువారం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ, మేనమామగా పిల్లలకు తానిచ్చే ఆస్తి చదువేనంటూ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేపట్టాలని సీఎం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారన్నారు.

నాడు-నేడు, అమ్మ ఒడి, జగనన్న విద్యా కానుక వంటి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారు. ఈ పథకాలన్నీ దేశానికే మార్గదర్శకంగా నిలిచాయన్నారు. నాణ్యమైన విద్య, నాణ్యమైన బోధన, నాణ్యమైన మౌలిక సదుపాయల కల్పనకు జాతీయ విద్యా విధానం 2020లో భాగంగా 5+3+3+4 విద్యా విధానం అమలు చేయాలని ముఖ్యమంత్రి సంస్కరణలకు శ్రీకారం చుట్టారన్నారు. 

పూర్వ ప్రాథమిక విద్యతో పాటు ఒకటి రెండు తరగతులు ప్రాథమిక విద్యలో, 3,4,5 తరగతులతో పాటు ఇంటర్మీడియట్ ను ఉన్నత విద్యలో చేర్చేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. దీనిపై ఉపాధ్యా సంఘాల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నామన్నారు. జాతీయ విద్యా విధానంపై ఎటువంటి అపోహలు నమ్మొద్దని కోరారు. ఏ ఒక్క పాఠశాల మూతపడదని, ఒక్క ఉపాధ్యాయ పోస్టు కూడా రద్దు కాబోదని భరోసా ఇచ్చారు.

ఏ అనుమానం ఉన్నా పరిష్కరిస్తామన్నారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించానికి సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కృషికి ఉపాధ్యాయులంతా సహకరించాలని కోరారు. నాడు – నేడు పనుల్లో భాగంగా క్రీడా మైదానాలు లేని పాఠశాలలు గుర్తించి భూములు కొనుగోలు చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు.

విద్యార్థుల్లో క్రీడల ప్రోత్సాహాకానికి స్పోర్ట్సు కిట్ అందజేయనున్నామన్నారు. మూడో విడత జగనన్న విద్యా కానుకలో అందజేసే ఈ కిట్ ద్వారా స్పోర్ట్సు షూస్, డ్రెస్ ఇవ్వనున్నామన్నారు. కొవిడ్ కారణంగా ఉపాధ్యాయులు మృతి చెందడం బాధాకరమని, వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు.