గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: మంగళవారం, 20 జులై 2021 (22:21 IST)

ఇపుడు విశాఖ‌లో ఇన్‌సైడ్ ట్రేడింగ్: కొన‌క‌ళ్ళ ఆరోప‌ణ‌

సుప్రీంకోర్టు తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వ  మొండివైఖరి విడనాడాల‌ని, అమరావతి పై వైసీపీ చేసిన ఆరోపణలు పచ్చి అబద్ధాలు అని తేలిపోయింద‌ని మచిలీపట్నం మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు అన్నారు.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇపుడు విశాఖలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరుగుతోంద‌ని ఆరోపించారు. మంగళవారం మచిలీపట్నంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, అమరావతి భూముల కొనుగోళ్లలో ఏ విక్రయదారుడుకీ నష్టం జరగలేదని తెలుగుదేశం పార్టీ ముందు నుంచి చెబుతూనే ఉంద‌న్నారు. 
 
అమరావతి భూములపై విషం కక్కిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మంత్రులు, దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు కు కంకణబద్ధులై వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆరు సంవత్సరాల తరువాత భూములు అమ్మిన వారి తరుపున ఏ ఒక్క ఫిర్యాదు రాకపోగా, ఎవరో ఒకరు ఫిర్యాదు చేస్తే దానిని భూతద్దంలో న్యాయస్థానంలో చూపించేందుకు ప్రయత్నం చేసి వైసీపీ ప్రభుత్వం విఫలం అయింది అన్నారు.
 
ఆస్తుల బదిలీ చట్టం ప్రకారమే కొనుగోళ్లు జరిగాయ‌ని, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆస్తుల విలువ గణనీయంగా పడిపోయింద‌న్నారు. ప్రభుత్వం ఆస్తుల విలువ 20 రెట్లు పెరిగిందని చెప్పటం అన్యాయమన్నారు. ఇప్పటికైనా గత తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటుచేసిన అమరావతిని, నేటి వైసీపీ పాలకులు మన రాష్ట్ర  ఏకైక  రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మచిలీపట్నం పార్లమెంట్ కార్యాలయ కార్యదర్శి, బత్తిన దాసు, ప్రచార కార్యదర్శి, పి.వి. ఫణి కుమార్, సీతారామయ్య, తదితరులు పాల్గొన్నారు.