విశాఖపట్నం స్మార్ట్ సిటీకి అమెరికా సహాయం!
విశాఖపట్నం స్మార్ట్ సిటీగా మారబోతోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో, ఏపీలోని పలు నగరాలను స్మార్ట్ సిటీలుగా తీర్చిదిద్దేందుకు కేంద్రం సానుకూలత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. స్మార్ట్ సిటీల నిర్మాణానికి మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కూడా అత్యధిక ప్రాధాన్యమిస్తోంది.
ప్రధాని నరేంద్ర మోడీ, తన అమెరికా పర్యటనలో భాగంగా మంగళవారం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో జరిపిన భేటీ సందర్భంగా స్మార్ట్ సిటీల అంశం ప్రస్తావనకు వచ్చింది.
భారత్ లో మూడు నగరాలను స్మార్ట్ సిటీలుగా తీర్చిదిద్దేందుకు సహాయం చేయనున్నట్లు ఒబామా ప్రకటించారు. ఒబామా ప్రకటనను స్వాగతించిన మోడీ, అమెరికా సహాయం చేయాల్సిన మూడు స్మార్ట్ సిటీల పేర్లను వెల్లడించారు.
ఇందులో రాష్ట్రంలోని విశాఖ కూడా ఉంది. అలహాబాద్, అజ్మీర్లను కూడా అమెరికా సహకారంతో మోడీ ప్రభుత్వం స్మార్ట్ సిటీలుగా తీర్చిదిద్దనుంది