మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: మంగళవారం, 27 మార్చి 2018 (20:32 IST)

వేలిముద్రలు సరిపోకపోతే రేషన్ ఇవ్వట్లేదని ఫిర్యాదు... చెడ్డపేరు తేవద్దన్న పత్తిపాటి

అమరావతి : వేలిముద్రలు సరిపోని పక్షంలో ఫోటో గుర్తింపు ఆధారంగా రేషన్ ఇచ్చే సౌకర్యాన్ని త్వరలో అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. వెలగపూడి సచివాలయంలో పలువురు ఎమ్మెల్యేలు బి. జయనాగేశ్వర్‌రెడ్ది, జ

అమరావతి : వేలిముద్రలు సరిపోని పక్షంలో ఫోటో గుర్తింపు ఆధారంగా రేషన్ ఇచ్చే సౌకర్యాన్ని త్వరలో అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. వెలగపూడి సచివాలయంలో పలువురు ఎమ్మెల్యేలు బి. జయనాగేశ్వర్‌రెడ్ది, జోగేశ్వరరావు, వెలగపూడి రామకృష్ణబాబు, కె. సర్వేశ్వరావు, పశీం సునీల్ కుమార్, పరుపుల నారాయణమూర్తి, గిడ్డి ఈశ్వరి, మీ సేవా, ఆర్.టి.జి.ఎస్, పౌరసరఫరాల శాఖ అధికారులతో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సమావేశం నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా కొందరు ఎమ్మెల్యేలు ఆన్‌లైన్‌లో రేషన్ కార్డుల బదిలీ చేయించుకునే సౌకర్యాన్ని సులభతరం చెయ్యాలని మంత్రిని కోరారు. కఠినతరమైన నిబంధనల వల్ల అనేక మంది రేషన్ పొందలేకపోతున్నారని అన్నారు. పలువురు డీలర్లు ఉద్దేశపూర్వకంగానే వేలిముద్రలు సరిపోలేదంటూ వారి రేషన్ స్వాహా చేస్తున్నారని మంత్రికి ఫిర్యాదు చేశారు. రేషన్ సరుకులు ఇవ్వకుండానే ఇచ్చినట్లు ఆర్.టి.జి.ఎస్‌లోచూపిస్తున్నారని వాటిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు మంత్రికి తెలిపారు. 
 
గిరిజన ప్రాంతాల్లో పక్కా గృహం, ఎల్.పి.జి గ్యాస్ కనెక్షన్ ఉన్నా లేకపోయిన సరే వారికి కిరోసిన్ ఇవ్వాలని ఎమ్మెల్యేలు మంత్రిని కోరారు. రేషన్ కార్డులలో చిన్నచిన్న సమస్యలు పరిష్కరించడానికి మూడు కంప్యూటర్ లాగిన్స్ ఫాలో కావాల్సీ వస్తుందని దానిని ఒక్కటికి పరిమితం చేయాలని కోరారు. నూతన రేషన్ కార్డులను జారీ చేసేటప్పుడు కార్డులను లామినేషన్ చేయించి లబ్ధిదారులకు ఇవ్వాలన్నారు. పై సమస్యలపై సానుకూలంగా స్పందించిన మంత్రి మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి త్వరితగతిన తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యేలకు చెప్పారు. 
 
వేలిముద్రలు సరిపోని పక్షంలో ఫోటో గుర్తింపు ఆధారంగా రేషన్ ఇచ్చే సౌకర్యాన్ని త్వరలో అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు మంత్రి ఎమ్మెల్యేలకు తెలిపారు. వరుసగా మూడు నెలల పాటు రేషన్ తీసుకోనివారి రేషన్ పునరుద్ధరణ అధికారం వీఆర్‌వోలకు ఇచ్చామన్నారు. మీసేవలో రేషన్ కార్డులకు సంబంధించి ఏ సమస్య కూడా పెండింగ్‌లో ఉండటానికి వీలు లేదని మంత్రి హెచ్చరించారు. 15 రోజులకు ఒక్కసారి మీసేవా, ఆర్.టి.జి.ఎస్, ఎన్.ఐ.సి అధికారులతో సమీక్షించి రేషన్ కార్డుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లు, మీసేవా సర్వీసు ద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.