శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 23 జనవరి 2020 (11:58 IST)

మూడు ముక్కలాట గురించి మోడీషాలకు తెలియదు : ఢిల్లీలో నడ్డాతో జనసేనాని భేటీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని వికేంద్రీకరణ అంశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు చెప్పి చేస్తున్నట్టు వైకాపా మంత్రులు, నేతలు పదేపదే చేస్తున్న ప్రచారాన్ని జనసేన పార్టీ కొట్టిపారేసింది. ఈ విషయాన్ని ఢిల్లీ పర్యటనలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టంచేశారు. ఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసిన తర్వాత ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. రాజధాని మార్పు అంశానికి ఢిల్లీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు. 
 
ఏపీలోని వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దించేంతవరకు నిద్రపోనని గర్జించిన పవన్ కళ్యాణ్.. ఢిల్లీకి వెళ్లారు. అక్కడ బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. ఆ తర్వాత తన కార్యాచరణను ముమ్మరం చేశారు. బీజేపీతో చేతులు కలిపిన ఆయన వైసీపీ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు. అమరావతే శాశ్వత రాజధాని అని... దీనిపై అలుపెరుగని పోరాటం చేస్తామని ఢిల్లీ వేదికగా ప్రకటించారు. రానున్న రోజుల్లో అద్భుతాలు జరగబోతాయంటూ ఆయన వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది.
 
"హస్తిలో ఉన్న పవన్ బుధవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో దాదాపు గంటకు పైగా సమావేశమయ్యారు. అనంతరం, కన్నా లక్ష్మీనారాయణ, జీవీఎల్ నరసింహారావు తదితర నేతలతో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. వైసీపీ కోరుకుంటున్న రాజధాని విశాఖలో రిపబ్లిక్ డే పరేడ్‌ను కూడా నిర్వహించలేక పోతున్నారని... అమరావతి సంగతి కూడా ఇంతేనని ఎద్దేవా చేశారు.
 
ఆ తర్వాత గురువారం ఉదయం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. నడ్డా నివాసానికి వెళ్లిన పవన్... బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వెంట జనసేన నేత నాదెండ్ల మనోహర్, బీజేపీ నేతలు సునీల్ డియోధర్, జీవీఎల్ నరసింహా రావు, పురంధేశ్వరిలు ఉన్నారు.