1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 14 ఆగస్టు 2023 (16:43 IST)

జగన్‌కే వార్నింగ్ ఇస్తున్నా.. మీ అవినీతి గుట్టును రట్టు చేస్తా : పవన్ కళ్యాణ్ హెచ్చరిక

vissanna pet lands
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. 2024 ఎన్నికల తర్వాత తమ ప్రభుత్వం ఏర్పాటైతే వైకాపా నేతలు చేసిన అవినీతి గుట్టును, భూముల కబ్జాను బహిర్గతం చేస్తామని హెచ్చరించారు. ఉత్తరాంధ్ర భూములను దోచేస్తుంటే మాట్లాడేవాడు లేడని ఆయన వాపోయారు. స్థానిక ఎమ్మెల్యేలు కూడా భూదోపిడీకి వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. విశాఖ జిల్లా విస్సన్నపేటలే రూ.13  వేల కోట్ల విలువ చేసే భూములను దోపిడీ చేశారని ఆరోపించారు. క్యాచ్‌మెంట్ ఏరియాలో రియాల్టీ వ్యాపారం ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు. సీఎం, రెవెన్యూ శాఖ, కలెక్టర్, అధికారుల దీనికి బాధ్యత తీసుకోవాలని ఆయన కోరారు. 
 
సోమవారం అనకాపల్లి నియోజకవర్గం బయ్యారం రెవెన్యూ డివిజన్‌ విస్సన్నపేట గ్రామంలో ఆయన పర్యటించారు. ఇక్కడ ఆక్రమణలకు గురై రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఒక వైపు ఉత్తరాంధ్ర యువతకు ఉద్యోగాలు లేవన్నారు. కానీ విస్సన్నపేట గ్రామంలో 13 వేల కోట్ల రూపాయలతో అనుమతులు లేనిచోట రియల్ ఎస్టేట్ వెంచర్ ఏర్పాటు చేశారని ఆరోపించారు. ఇక్కడ 600 ఎకరాలు పోరంబోకు, దళితుల భూములని, పైగా, ఇది క్యాచ్‌మెంట్ ఏరియా అని అన్నారు. 
 
ఉత్తరాంధ్ర భూములను దోచేస్తున్నారని, తెలంగాణలోను ఇలాగే దోచేస్తే తన్ని తరిమేశారన్నారు. క్యా‌చ్‌మెంట్ ఏరియాలో రియాల్టీ వ్యాపారం ఎలా చేస్తారని ప్రశ్నించారు. తాను సీఎం జగనే‌కే చెబుతున్నానని, మధ్యలో వచ్చి మాట్లాడే మంత్రులను పట్టించుకోనన్నారు. సీఎంగా ఉంటూ ఆయన చేసే అవినీతిని బయటపెడతామన్నారు. 
 
ఈ అక్రమాలకు జగన్, రెవెన్యూ శాఖ, కలెక్టర్, అధికారులు బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రాథమిక హక్కులను ఎలా ఉల్లంఘిస్తారని ప్రశ్నించారు. ఇక్కడ దళితులకు ఇచ్చిన భూములు ఉన్నాయని, ఇక్కడ రోడ్లు ఎలా వేస్తారు? అని నిలదీశారు. అడ్డగోలుగా భూములను దోచేస్తుంటే కలెక్టర్ ఏం చేస్తున్నారన్నారు.
 
వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ లేదు, జాబ్ క్యాలెండర్ లేదు కానీ వేల కోట్లు దోచుకోవడానికి వైసీపీ నాయకులు రియల్ ఎస్టేట్ వెంచర్లు మాత్రం వేస్తారన్నారు. గ్రామాల్లో కనీసం రోడ్లు లేవని, కానీ ఇక్కడి రియాల్టీ వెంచర్లో 100 అడుగుల రోడ్డు, హెలిప్యాడ్ ఉందన్నారు. దళితుల భూములు, సాగునీటి ప్రాజెక్టులు ఆక్రమించి రూ.13 వేల కోట్ల దోపిడీకి పాల్పడ్డారన్నారు. 
 
పర్యావరణాన్ని ధ్వంసం చేస్తున్నారని, సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన భూములు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. దీనిపై గ్రీన్ ట్రైబ్యునలు ఫిర్యాదు చేస్తామన్నారు. స్థానిక రైతులు భూకుంభకోణంపై ఫిర్యాదు చేశారని, అందుకే దీనిని పరిశీలించేందుకు వచ్చినట్లు చెప్పారు.