బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 26 మే 2020 (14:04 IST)

లాక్డౌన్ రూల్స్ బ్రేక్ చేసిన చంద్రబాబు.. హైకోర్టులో పిటిషన్ దాఖలు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లాక్డౌన్ కారణంగా హైదరాబాద్‌లో చిక్కుకునిపోయారు. చివరకు రెండు నెలల తర్వాత సోమవారం హైదరాబాద్ నుంచి అమరావతి, ఉండవల్లిలోని తన నివాసానికి వచ్చారు. ఆయనతో పాటు ఆయన తనయుడు, పార్టీ జాతీయ కార్యదర్శి లోకేశ్‌ కూడా ఉన్నారు. 
 
అయితే, హైదరాబాద్‌ నుంచి అమరావతి దాకా దారి వెంబడి చంద్రబాబుకు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. తెలంగాణ నుంచి ఏపీకి చేరుకునే గరికపాడు చెక్‌పోస్టుతో పాటు వివిధ కూడళ్లలోనూ పార్టీ నాయకులు, కార్యకర్తలు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. 
 
వాస్తవానికి చంద్రబాబు హైదరాబాద్ నుంచి నేరుగా విశాఖపట్టణం వెళ్లి, అక్కడ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ బాధితులను పరామర్శించాల్సివుంది. కానీ, విమాన సర్వీసులు ఏపీలో ప్రారంభం కాకపోవడంతో ఆ పర్యటన వాయిదా పడింది. దీంతో ఆయన నేరుగా రోడ్డు మార్గంలో హైదరాబాద్ నుంచి ఉండవల్లికి చేరుకున్నారు. 
 
ఈ సమయంలో ఆయనకు దారి పొడవునా తెదేపా శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ర్యాలీలకు అనుమతి లేనప్పటికీ రోడ్డు పొడవునా ఆయనకు టీడీపీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఇలా చేయడం లాక్డౌన్ రూల్స్‌కు వ్యతిరేకమని అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ వి.గోపాల్ రెడ్డి హైకోర్టులో ఫిర్యాదు చేశారు. 
 
చంద్రబాబు కాన్వాయ్ తెలంగాణ - ఆంధ్రా సరిహద్దు దాటిన తర్వాత టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగత కార్యక్రమాలు ఏర్పాటు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక అలాగే కోర్టుకు లేఖ రాసిన వైసీపీ ఎమ్మెల్యే నాగార్జున హైదరాబాద్ నుంచి అమరావతికి చంద్రబాబు భారీ కాన్వాయ్‌తో వచ్చారని, టీడీపీ నేతలు, కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించి కరోనా వ్యాప్తి జరిగేలా ప్రవర్తించారని లేఖలో పేర్కొన్నారు. 
 
రాష్ట్రంలోకి వచ్చేందుకు డీజీపీ ప్రత్యేక అనుమతులు ఇస్తే దాన్ని చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్నారని ఆరోపించారు. తమ లేఖనే ఫిర్యాదుగా స్వీకరించి.. సుమోటోగా చంద్రబాబుపై కేసు నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టు న్యాయమూర్తికి లేఖ రాశారు.