1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 18 మార్చి 2021 (12:13 IST)

చంద్రగిరిలో చంద్రబాబు సోదరిని కూడా వదలని సీఐడీ

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును రాష్ట్ర సీఐడీ వెంటాడుతోంది. నవ్యాంధ్ర రాజధాని అమరావతి కోసం అసైన్డ్ భూములను లబ్దిదారులను బెదిరించి తక్కువ ధరకు కొనుగోలు చేశారన్న ప్రధాన అభియోగంపై బాబుకు సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం తెల్సిందే. 
 
ఈ నేపథ్యంలో చంద్రగిరి మండలం కందులవారిపల్లెలో ఉంటున్న చంద్రబాబునాయుడు సోదరి హైమావతిని కూడా సీఐడీ పోలీసులు వదిలిపెట్టలేదు. ఆమె ఇంటికి పోలీసులు వచ్చి ఫొటోలు తీయడం కలకలం రేపింది. 
 
మంగళవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కొందరు వ్యక్తులు వచ్చి పోలీసులమని కాపలాదారుకు చెప్పి లోపలికి వెళ్లారు. అయితే, ఇంటి ఆవరణలో సీసీ కెమెరాలు ఉండటంతో మళ్లీ బయటకు వచ్చి పరిసరాలను ఫొటోలు తీశారు.
 
అనంతరం హైమావతి ఇంటి కాపలాదారు రవి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదు సందర్భంగా సీసీటీవీ పుటేజీలను పోలీసులకు రవి అందించాడు. 
 
ఈ ఘటనపై సీఐ రామచంద్రారెడ్డి వివరణ ఇస్తూ.. నారావారిపల్లెలోని చదలవాడ సుచరిత ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి గొడవ చేస్తున్నట్టు తమకు సమాచారం అందిందని, అయితే తమ సిబ్బంది పొరపాటున నారావారిపల్లెకు కాకుండా కందులవారి పల్లెకు వెళ్లారని అన్నారు. హైమావతి కుమార్తె పేరు కూడా సుచరిత కావడంతో ఆమె ఇంటికి వెళ్లారని సీఐ పేర్కొన్నారు.