1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 15 డిశెంబరు 2019 (12:28 IST)

మతిస్థిమితం లేని యువతిపై అత్యాచారం

రాష్ట్ర అసెంబ్లీలో 'దిశ' బిల్లుకు ఆమోదం లభించిన రోజే ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. మతిస్థిమితం లేని యువతిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం... త్రిపురాంతకం మండలానికి చెందిన యువతి(19)కి మతిస్థిమితం లేదు. శుక్రవారం రాత్రి 10గంటల సమయంలో బహిర్భూమి కోసం బయటకు వచ్చిన ఆమెను ఇంటి పక్కనే ఉండే అలవాల కరుణాకర్‌రెడ్డి బలవంతంగా లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. ఆమె ఎంతకూ ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు, బంధువులు వెతకడం ప్రారంభించారు.
 
 
గ్రామంలోని రామాలయం సమీపంలో ఆమెతో పాటు ఉన్న నిందితుడు వీరిని చూసి పరారయ్యాడు. బాధితురాలి పెదనాన్న కుమారుడు ఫిర్యాదు చేయడంతో వెంటనే స్పందించిన పోలీసులు గ్రామశివారులోని రైస్‌మిల్లులో దాక్కున్న కరుణాకర్‌రెడ్డిని శుక్రవారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం మార్కాపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎర్రగొండపాలెం సీఐ మారుతీకృష్ణ తెలిపారు.