1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: మంగళవారం, 20 జులై 2021 (15:09 IST)

స్టీల్ ప్లాంట్ ప్ర‌యివేటీక‌ర‌ణ‌పై లోక్ సభలో ప్లకార్డుల‌తో నిర‌స‌న

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తే, ఊరుకునేది లేద‌ని లోక్ స‌భ‌లో నిర‌స‌న తెలిపారు. విశాఖ ఎంపీ  ఎం. వి .వి. సత్యనారాయణతో స‌హా ఆంధ్ర ఎంపీలు ప్లకార్డులు పట్టుకొని నిరసన గళాన్ని సభాపతికి వినిపించారు. విశాఖ ఎంపీ ఎం. వి .వి సత్యనారాయణ "వైజాగ్ స్టీల్ ప్లాంట్- నాట్ ఫర్ సేల్" అంటూ తనదైన గళాన్ని వినిపించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎంతో మంది త్యాగధనుల ఆత్మార్పణ త్యాగ ఫలమే వైజాగ్ స్టీల్ ప్లాంట్ అని, అటువంటి ఉక్కు కర్మాగారాన్ని అమ్మకానికి పెట్ట దలచిన  కేంద్ర దుశ్చర్యను తాను తీవ్రంగా ఖండిస్తున్నా అని తెలిపారు.

ఈ ప్రతిపాదనను తక్షణమే వెనక్కి తీసుకోలేని పక్షంలో, పార్టీ ఆదేశాల మేరకు తాము ఎంతవరకైనా వెళ్లి, ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిలుపుదల చేసేంత వరకు కృషి చేస్తామన్నారు. సభా కార్యక్రమాలు అడ్డుకున్న తరుణంలో,  స్పీకర్ మధ్యాహ్నం రెండు గంటల వరకు లోక్ సభను వాయిదా వేశారు.