శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 20 సెప్టెంబరు 2020 (16:46 IST)

గోటితో పోయేదానికి గొడ్డలిదాకా తెచ్చుకోవడం ఎందుకు: రఘురామ

తిరుమల డిక్లరేషన్‌ విషయంలో చిన్నసంతకంతో పోయే దానికి ఎందుకింత రచ్చ అని ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. గోటితో పోయేదానికి గొడ్డలిదాకా తెచ్చుకోవడం ఎందుకని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం జగన్‌ తిరుమల వెళ్లినపుడు డిక్లరేషన్‌ ఇవ్వాలని కోరుతున్నట్లు రఘురామకృష్ణరాజు చెప్పారు.

దిల్లీలో రఘురామకృష్ణరాజు మీడియాతో మాట్లాడారు. తితిదేలో వీవీఐపీలకు మాత్రమే డిక్లరేషన్‌ విధానం ఉందన్నారు. గత జీవోను రద్దు చేయకుండా నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేసే అధికారం తితిదే ఛైర్మన్‌కు లేదన్నారు. ఏపీలో హిందూ దేవాలయాలపై దాడులకు నిరసనగా నల్లబ్యాడ్జి ధరించి పార్లమెంట్‌ సమావేశాల్లో పాల్గొంటానని రఘురామకృష్ణరాజు తెలిపారు.

దేవాలయాల దాడుల అంశంపై సీబీఐ విచారణ అడుగుతుంటే తమ పార్టీ వాళ్లు అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. ఒకట్రెండు నెలల్లోనే తనను పార్టీ నుంచి బహిష్కరిస్తారని అనుకుంటున్నానని.. తనపై అనర్హత వేటు వేయించడం సాధ్యం కాదని రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు.