మంగళవారం, 17 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 25 జులై 2024 (10:56 IST)

అమరావతికి మహర్ధశ : రూ.2 వేల కోట్లతో రైల్వే లైన్ అభివృద్ధి... రైల్వేమంత్రి అశ్విని

amaravati capital
నవ్యాంధ్ర రాజధాని అమరావతికి మహర్ధశ కలిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్ల నిధులు ఇవ్వనున్నట్టు కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. తాజాగా రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ కూడా మరో తాయిలం ప్రకటించారు. రాష్ట్ర రాజధాని అమరావతికి రైలు మార్గం అనుసంధానం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.2047 కోట్లతో 56 కిలోమీటర్ల రైల్వేలైన్‌ను అభివృద్ధి చేస్తుందని తెలిపారు. ఈ మార్గంలో కృష్ణా నదిపై ఒక భారీ వంతెన కూడా నిర్మించాల్సివుండటంతో ఇంత భారీ స్థాయిలో ఖర్చు చేయాల్సివుందని ఆయన పేర్కొన్నారు. 
 
ఆయన బుధవారం రైల్వే భవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ, 'ఆంధ్రప్రదేశ్ చాలా ముఖ్యమైన రాష్ట్రం. గత పదేళ్లలో రాష్ట్రానికి గతంలో ఎన్నడూ లేనన్ని నిధులు కేటాయించాం. 2009-14 మధ్య ఉమ్మడి రాష్ట్రానికి ఏటా సగటున రూ.886 కోట్లు కేటాయిస్తే, నరేంద్ర మోడీ ప్రభుత్వంలో విభజిత ఆంధ్రప్రదేశ్‌కు ఈ ఏడాది ఒక్కటే రూ.9,151 కోట్లు కేటాయించాం. యూపీఏ హయాంలో ఏటా సగటున 72 కి.మీ. రైలే లైన్ల నిర్మాణం జరిగితే, మోడీ ప్రభుత్వం వచ్చాక అది 150 కి.మీ.కి పెరిగింది. 
 
రాష్ట్రంలో రైల్వేలైన్ల విద్యుదీకరణ 100 శాతం పూర్తయింది. ప్రస్తుతం ఏపీలో రూ.73,743 కోట్ల విలువైన ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. అమృత్ పథకం కింద 73 స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నాం. గత పదేళ్లలో 743 ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లు నిర్మించాం. ఈ ఏడాది ఏప్రిల్ 1 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూ.26,292 కోట్ల విలువైన 1,935 కి. మీ. 17 కొత్త లైన్ల నిర్మాణం కొనసాగుతోంది' అని అశ్వినీ వైష్ణవ్ వివరించారు. 
 
అమరావతి రైల్వే లైనుకు సంబంధించిన డీపీఆర్‌కు రైల్వే బోర్డు ఆమోదం తెలిపిన తర్వాత ఇటీవల నీతిఆయోగ్ ఆమోదముద్ర వేసిందన్నారు. తదుపరి దశ అనుమతులకు కొంత సమయం పడుతుందన్నారు. ఇప్పటివరకు ఈ ప్రాజెక్టు పురోగతి బాగుందన్నారు. ఈ లైన్ ఎర్రుపాలెం నుంచి ప్రారంభమై కృష్ణా నది మీదుగా అమరావతి స్టేషన్ నుంచి నంబూరు వరకు వెళ్తుందని మంత్రి అశ్వినీ వైష్ణవ్ వివరించారు.