1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , బుధవారం, 27 అక్టోబరు 2021 (11:14 IST)

ఏపీలో రేష‌న్ డీల‌ర్ల ఆందోళ‌న ... త‌గ్గేదేలా అన్న మంత్రి కొడాలి నాని

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో చౌక ధర దుకాణ డీలర్ల ఆందోళనలు ఇవాళ కూడా కొనసాగుతున్నాయి. జీవో నంబర్ 10 రద్దుతో, బియ్యం బ‌స్తా సంచుల విష‌యంలో వివాదాన్ని, ఇత‌ర సమస్యలను పరిష్కరించాలంటూ రేషన్ డీలర్లు ఆందోళన చేస్తున్నారు. సీఎం జగన్ తమ సమస్యలపై స్పందించే వరకు నిరసనలు కొనసాగుతాయని వారు స్పష్టం చేస్తున్నారు.
 
 
ఉన్నతాధికారులతో చర్చలు జ‌ర‌పాల‌ని ప్ర‌భుత్వం నిర్దేశించ‌గా, రేషన్ డీలర్లతో ఉన్నతాధికారులు బుధవారం చర్చలు జరిపారు. రాష్ట్ర పౌరసరఫరాల కమిషనర్ గిరిజాశంకర్​తో జరిపిన చర్చలు ఇంకా ఒక కొలిక్కిరాలేదు. దీనితో ఇవాళ కూడా గిడ్డంగుల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు డీలర్లు తెలిపారు.

 
అయితే, దీనిపై ఏపీ పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి కొడాలి నాని ఘాటుగానే స్పందించారు. వారు ద‌ర్నాలు చేసి, బెదిరిస్తే, తాము త‌గ్గేదేలేద‌న్నారు. రేష‌న్ బియ్యం పంపిణీ ఆగదని తేల్చి చెప్పారు. రేషన్ డీలర్లు ధర్నాకు దిగితే రేషన్ పంపిణీ ఆగదని మంత్రి కొడాలి నాని అన్నారు. రేషన్ సరఫరా వాహనాలు ఉన్నాయని, ఇంటింటికి వాహనాల ద్వారా రేషన్ పంపిణీ చేస్తామని మంత్రి పేర్కొన్నారు. చర్చల ద్వారా తమ సమస్యలను పరిష్కరించుకోవాలని డీలర్లకు సూచించారు.