1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By మోహన్
Last Updated : సోమవారం, 1 ఏప్రియల్ 2019 (18:51 IST)

తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు...

ఏప్రిల్ మాసం ప్రారంభమైంది. వేసవికాలం వచ్చేసింది. రోజురోజుకూ పగటి పూట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మండిపోతున్న ఎండలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. హైదరాబాద్ నగరంలో సోమవారం (ఏప్రిల్ 1) నాడు 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఉష్ణోగ్రతలు మున్ముందు మరింతగా పెరుగుతాయని  వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. 
 
మంగళవారం నుంచి తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని.. ఈ ప్రభావంతో వేడి మరింతగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఆదివారం ఉష్ణోగ్రతలను చూస్తే అత్యధికంగా రామగుండం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ళబయ్యారం, నిర్మల్ జిల్లాపెంబిలలో 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 
 
కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట, నిర్మల్‌ జిల్లా భైంసా, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్ల, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లలో 43.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. చాలా జిల్లాల్లో సాధారణం కన్నా రెండు డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు పెరిగాయని వాతావరణ శాఖ తెలిపింది.
 
మరోవైపు ఆంధ్ర ప్రదేశ్‌లో సైతం భానుడి ప్రతాపం రోజు రోజుకూ ఎక్కువ అవుతోంది. ప్రధాన నగరాలైన విశాఖ, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలులో కూడా వాతావరణం పొడిగా ఉంటూ వేడి గాలులతో 40 కంటే ఎక్కువ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వేసవిని ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని ఆరోగ్య శాఖ సూచిస్తోంది. ఉదయం 10 గంటలపైన ఎండలో తిరగవద్దని హెచ్చరిస్తోంది. వడదెబ్బ తగిలే ప్రమాదాలు ఎక్కువగా ఉండటం వల్ల తగుజాగ్రత్తలు తీసుకోవాలంటూ ఇప్పటికే ప్రచారం చేస్తోంది.