1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 15 ఏప్రియల్ 2020 (12:59 IST)

సంగారెడ్డి జిల్లాలో బాలుడికి కరోనా.. రిస్క్‌ జోన్‌లోకి పాతబస్తీ

సంగారెడ్డి జిల్లాలో ఓ బాలుడికి కరోనా సోకింది. ఈ విషయంపై ఉత్కంఠ కొనసాగుతోంది. వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మండలం బీరంగూడ సాయికృపకాలనీకి చెందిన ఏడేండ్ల బాలుడికి కరోనా ఎలా సోకిందనే విషయంపై చర్చ సాగుతోంది. 
 
సోమవారం బాలుడికి కరోనా నిర్ధారణ కాగానే కుటుంబసభ్యులను ఐసొలేషన్‌కు తరలించారు. మంగళవారం బాలుడి అమ్మమ్మ, తాత, తల్లి, చెల్లికి కరోనా నిర్ధారణ పరీక్షలో నెగెటివ్‌ వచ్చింది. తండ్రి ఫలితాలు రావాల్సి ఉన్నది. 
 
ఆ ఫలితాలు వస్తే.. ఈ వ్యవహారంపై స్పష్టమవుతుందని జిల్లా వైద్యాధికారి మోజీరాం రాథోడ్‌ చెప్పారు. తండ్రికి నెగెటివ్‌ వస్తే జర్మనీ నుంచి వచ్చాక బాలుడు ఎవరెవరిని కలిశారు? ఎవరి ఇంటికి వెళ్లాడనే కోణాల్లో విచారిస్తామన్నారు. బాలుడితో సన్నిహితంగా ఉన్నవారిని క్వారంటైన్‌కు తరలిస్తున్నామన్నారు.
 
ఇదిలా ఉంటే.. పాతబస్తీలో పాజిటివ్‌ కేసుల సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతోంది. ఓల్డ్‌ సిటీ మరింత రిస్క్‌ జోన్‌లోకి వెళ్తోంది. జనసాంద్రత ఎక్కువగా ఉండటం, ఢిల్లీకి మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారు ఈ ప్రాంతంలో పర్యటించడం ప్రధాన కారణాలుగా తెలుస్తున్నాయి. 
 
రాష్ట్ర వ్యాప్తంగా 592 కేసులు నమోదు కాగా, హైదరాబాద్‌లో 267 కేసులు నిర్థారణైయ్యాయి. కేవలం పాతబస్తీ నుంచే 57 కేసులు నమోదయ్యాయి. పాతబస్తీలో పాజిటివ్‌ కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. వైరస్‌ ప్రభావం ప్రారంభంలో తక్కువగా ఉన్నా ఢిల్లీ మత ప్రార్థనల తర్వాత ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరిగింది.