ఏపీ లిక్కర్ స్కామ్ : ఆ ఇద్దరు ఐఏఎస్ అరెస్టు
ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మూడు రోజుల సుధీర్ఘ విచారణ అనంతరం నాటి ముఖ్యమంత్రి కార్యదర్శిగా పని చేసిన ధనుంజయ్ రెడ్డితో పాటు అప్పటి సీఎ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిని ప్రత్యేక దర్యాప్తు (సిట్) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మూడు రోజుల పాటు వీరిని విచారించిన సిట్ అధికారులు, మద్యం స్కామ్లోకి వీరి ప్రమేయంపై స్పష్టత వచ్చిన తర్వాత ఈ సాయంత్రం అరెస్టు చేసినట్టు వెల్లడించారు. దాదాపు తొమ్మిది గంటల పాటు వీరిద్దరినీ సిట్ అధికారులు ప్రశ్నించినట్టు సమాచారం. ఈ కేసులో ధనుంజయ్ రెడ్డి ఏ31 నిందితుడు, కృష్ణమోహన్ రెడ్డి ఏ32గా నిందితుడిగా ఉన్నారు.
కాగా, ఇదే కేసులో వీరికి ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్లు సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. పిటిషన్లకు వ్యతిరేకంగా తగిన ఆధారాలు ఉన్నాయని, దర్యాప్తు కీలక దశలో ఉన్నందున్న ఈ సమయంలో ముందస్తు బెయిల్ ఇవ్వలేమని జస్టిస్ పార్థీవాలా నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.
ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే అది దర్యాప్తు అధికారి విచారణకు ఆటంకం కలిగించినట్టు అవుతుందని అభిప్రాయపడింది. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా వీరి మందుస్తు బెయిల్ అభ్యర్థనను తిరస్కరించిగా, ఆ తీర్పు సవాల్ చేస్తూ వీరు సుప్రీంకోర్టును అశ్రయించారు. అయితే, రెగ్యులర్ బెయిల్ కోసం నిబంధనలు, మెరిట్స్ ఆధారంగా హైకోర్టు లేదా ట్రయల్ కోర్టును ఆశ్రయించవచ్చని సుప్రీంకోర్టు సూచించింది.