శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 23 జూన్ 2020 (19:42 IST)

వారిద్దరిని కలవడం చట్టవిరుద్ధమైన చర్య కాదు : సుజనా చౌదరి

తమ పార్టీ నేత కామినేని శ్రీనివాస్, ఏపీ మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను కలవడం పట్ల బీజేపీ ఎంపీ సుజనా చౌదరి వివరణ ఇచ్చారు. ఒకరు తమ పార్టీ నేత అని, మరొకరు తమ కుటుంబానికి దగ్గరి వ్యక్తి అని, వారిద్దరిని కలవడం చట్ట విరుద్ధమైన చర్య కాదన్నారు. 
 
రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేశ్‌తో భేటీపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి వివరణ ఇచ్చారు. నిమ్మగడ్డతో తాను ఎలాంటి రహస్య సమావేశాలను జరపలేదని ఆయన తెలిపారు. 
 
తనను కలవడానికి బీజేపీ నేత కామినేని శ్రీనివాస్ అపాయింట్ మెంట్ తీసుకున్నారని చెప్పారు. అదే రోజున నిమ్మగడ్డ రమేశ్ కూడా తనను కలవాలని అడిగారని తెలిపారు.
 
లాక్డౌన్ సమయంలో తన కార్పొరేట్ కార్యాలయాన్ని హోటల్ పార్క్ హయత్‌కు మార్చానని... దీంతో, తనను కలిసేందుకు వీరిద్దరూ అక్కడికే వచ్చారని చెప్పారు. వీరిద్దరూ తనతో విడివిడిగా సమావేశమయ్యారని తెలిపారు. ఇదేమీ చట్ట విరుద్ధమైన చర్య కాదని అన్నారు. ఈ మేరకు ఆయన ప్రెస్‌నోట్ ద్వారా తెలియజేశారు.
 
ముఖ్యంగా, కామినేని శ్రీనివాస్ తన పార్టీకే చెందిన నేత కాగా, నిమ్మగడ్డ రమేష్ కుమార్ తమ కుటుంబానికి దగ్గర వ్యక్తి అని సుజనా చెప్పారు. వీరిద్దరూ తనను కలవడంలో తప్పేముందని ప్రశ్నించారు. 
 
నిమ్మగడ్డతో సమావేశంలో ఆయనను ఎస్ఈసీగా తొలగించిన అంశంపై చర్చించలేదని చెప్పారు. తానేదో కుట్ర రాజకీయాలకు తెరలేపానంటూ వైసీపీ నేతలు బురద చల్లే రాజకీయాలను చేస్తున్నారని... వీటిని తాను పట్టించుకోనని అన్నారు. తాను అలాంటి రాజకీయాలు చేయలేనని చెప్పారు.