1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 23 జూన్ 2020 (14:05 IST)

బీజేపీ నేతలతో నిమ్మగడ్డ రహస్య భేటీ? - వీడియో ఫూటేజీ లీక్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర మాజీ ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ బీజీపీకి చెందిన ఇద్దరు సీనియర్ నేతలతో భేటీ అయ్యారు. వీరిలో మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరిలు ఉన్నారు. ఈ ముగ్గురి రహస్య భేటీకి సంబంధించిన వీడియో ఫూటేజీ దృశ్యాలు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నాయి. 
 
ఈ ముగ్గురు వీఐపీలు హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో వీరి రహస్య సమావేశం జరిగింది. ఈ నెల 13న జరిగిన భేటీలో సుమారు గంటసేపు చర్చించినట్టు వీడియోల ద్వారా తెలుస్తోంది. ఎన్నికల సంఘం వివాదం నడుస్తుండగా రహస్యంగా సమావేశమవ్వడం.. రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. 
 
ఏపీ ఎన్నికల సంఘం కేసు ప్రస్తుతం సుప్రీం కోర్టులో ఉన్న నేపథ్యంలో ఈ ముగ్గురి భేటీ చర్చనీయాంశంగా మారింది. ఆ చర్చల సారాంశం ఏమిటన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 
 
అలాగే, పార్క్ హయత్ లాంటి హోటల్‌లో జరిగిన కీలక సమావేశానికి సంబంధించి సీసీ టీవీ ఫుటేజ్ బయటకు రావడం సందేహాస్పదంగా ఉంది. కావాలనే ఎవరో సీసీ టీవీ ఫుటేజ్‌ను బయటపెట్టారన్న వాదనలు వినపడుతున్నాయి. 
 
ఏది ఏమైనా ఈ భేటీ రాజకీయంగా తీవ్ర దుమారాన్నే లేపుతోంది. ఎన్నికల సంఘం కేసులో వైసీపీకి అస్త్రం దొరికినట్టేనని భావింవచ్చు. అదేసమయంలో టీడీపీ నేతలెవరూ ఈ భేటీలో లేకపోవడం ఆ పార్టీకి కాస్త కలిసి వచ్చినా... సుజనా చౌదరి ఉండటం వల్ల దాన్ని ప్రత్యర్థులు ఆయుధంగా వాడుకునే అవకాశం ఉందంటున్నారు.