1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 17 అక్టోబరు 2023 (10:34 IST)

నేడు చంద్రబాబు పిటిషన్లపై విచారణ : బెయిలా? క్యాష్ కొట్టివేతనా?

chandrababu
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బెయిల్‌ పిటిషన్‌తో పాటు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరుగనుంది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా తనపై నమోదు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కేసును కొట్టేయాలని కోరుతూ ఆయన సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు రానుంది. ఈ కేసులో చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే, ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గీ వాదనలు వినిపించనున్నారు. 
 
నిజానికి గత శుక్రవారం కోర్టు పనివేళలు ముగిసే సమయానికి రాష్ట్ర ప్రభుత్వ వాదనలు పూర్తికానందున మంగళవారం మధ్యాహ్నం విచారణ ప్రారంభమైన వెంటనే సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గీ తన వాదనలను వినిపిస్తారు. తన వాదనలను పూర్తిచేయడానికి మరో అరగంట సమయం కావాలని గత విచారణ సమయంలోనే ఆయన ధర్మాసనానికి విన్నవించారు. 
 
ముకుల్ రోహిత్గీ వాదనలు పూర్తయిన వెంటనే సాల్వే కౌంటర్ వాదనలు ప్రారంభించనున్నారు. మంగళవారం సాయంత్రానికల్లా అన్నిపక్షాల వాదనలు ముగిసే అవకాశం ఉంది. ఆ తర్వాత ధర్మాసనం తీర్పు రిజర్వు చేస్తుందా? లేదంటే ఇంకేమైనా చెబుతుందా? అన్నది తేలుతుంది. హైకోర్టులో తాను దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను కొట్టేస్తూ ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాస రెడ్డి గత నెల 22న ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలుచేసిన విషయం తెలిసిందే. 
 
ఈ కేసు విచారణ సెప్టెంబర్ 23వ తేదీ నుంచి వాయిదాలతో కొనసాగుతూ వస్తోంది. మంగళవారం మధ్యాహ్నం ఇరుపక్షాల వాదనలు ముగిసిన తర్వాత, ధర్మాసనం ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కేసును కూడా విచారించనుంది. గత 39 రోజులుగా అక్రమ నిర్బంధంలో ఉన్న చంద్రబాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభిస్తుందని టీడీపీ కార్యకర్తలు ఉత్కంఠతగా ఎదురు చూస్తున్నారు.