1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 21 అక్టోబరు 2021 (10:01 IST)

పగిలిన అద్దాలు, ధ్వంసమైన ఫర్నిచర్ మధ్యలోనే చంద్రబాబు దీక్ష ప్రారంభం

గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దీక్ష ప్రారంభమైంది. ఈ ప్రధాన కార్యాలయంతో పాటు వివిధ జిల్లాల్లోని పార్టీ కార్యాలయాలపై దాడికి నిరసనగా ఆయన దీక్ష చేపడుతున్న విషయం తెల్సిందే. 
 
గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ దీక్ష శుక్రవారం రాత్రి 8 గంటల వరకు కొనసాగనుంది. టీడీపీ కార్యాలయంలోనే 36 గంటల పాటు ఆయన దీక్ష కొనసాగించనున్నారు. 
 
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు, కార్యకర్తల దాడిలో పగిలిన అద్దాలు, ధ్వంసమైన ఫర్నిచర్ మధ్యలోనే వేదిక ఏర్పాటుచేశారు. ఇక, వివిధ జిల్లాల నుంచి దీక్షకు మద్దతుగా టీడీపీ కేంద్ర కార్యాలయానికి తరలి రానున్నారు. 
 
మరోవైపు, దీక్షలో కోవిడ్ నిబంధనలు పాటించాలని ఇప్పటికే టీడీపీకి గుంటూరు అర్బన్ పోలీసుల నోటీసులు ఇచ్చారు. అయితే, నేతలు.. కార్యకర్తలని పార్టీ కార్యాలయం వరకు పోలీసులు అనిమతిస్తారా అనేది అనుమానంగా మారింది. 

దీక్షకు వెళ్లకుండా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, పెదవేగి, గోపాలపురం మండలాల్లో తెదేపా నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు.

మరోవైపు మంగళవారం నాడు అరెస్టు చేసిన తెదేపా నేత బ్రహ్మం చౌదరిని ఈ తెల్లవారుజామున మంగళగిరి గ్రామీణ పీఎస్‌కు తరలించారు. ఆ సమయంలో అదుపులోకి తీసుకున్న మిగతా వారిని నిన్న సాయంత్రం వదిలిపెట్టారు. ఏ కేసులో బ్రహ్మంను అరెస్టు చేశారో పోలీసులు వివరాలు వెల్లడించలేదు.