శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 8 జులై 2019 (18:37 IST)

టీడీపీకి గడ్డుకాలం..? కిషన్ రెడ్డితో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మంతనాలు

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ప్రస్తుతం తీవ్రమైన సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఓవైపు ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీ తీర్థం పుచ్చుకోగా, పార్టీలోని కాపు సామాజికవర్గ నేతలు పక్కచూపులు చూడటం టీడీపీ అధినేత చంద్రబాబును కలవరపెడుతోంది.

ఈ నేపథ్యంలో తాజాగా టీడీపీ నేత, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డితో భేటీ అయ్యారు. తెలుగురాష్ట్రాల్లో కిషన్ రెడ్డి పర్యటిస్తున్న నేపథ్యంలో వంశీ ఆయనతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
 
వల్లభనేని వంశీ బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని రాజకీయవర్గాల్లో వార్తలు జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వార్తలపై ఇటు బీజేపీ, అటు వల్లభనేని వంశీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. బీజేపీ నేత సుజనా చౌదరి ఇటీవల వల్లభనేని వంశీని బీజేపీలో చేరాలని ఆహ్వానించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే తాను టీడీపీని వీడబోనని అప్పట్లోనే వల్లభనేని వంశీ ప్రకటించారు.
 
టీడీపీని వీడను.. వల్లభనేని వంశీ స్పందన
"నిన్న స్వర్ణభారత్ ట్రస్టులో కిషన్ రెడ్డితో ప్రతీభకు పురస్కారం అనే కార్యక్రమంలో నన్ను ఆహ్వానించారు. ఆహ్వానం మేరకే పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమం పాల్గొనే ముందు చంద్రబాబు నాయుడు గారికి చెప్పి వెళ్లాను ఇంతకు మించి ఈ విషయంపై మాట్లాడేందుకు ఏమీ లేదు. టీడీపీని వీడే ప్రసక్తే లేదు" అన్నారు.