1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : బుధవారం, 29 మే 2019 (17:53 IST)

ఒక్క ఛాన్స్ నినాదమే కొంపముంచిది సార్ .. ప్రమాణ స్వీకారానికి వద్దు : టీడీపీ నేతలు

ఏపీ శాసనసభ ఎన్నికల్లో అధికార టీడీపీ చిత్తుగా ఓడిపోవడానికి గల కారణాలను టీడీపీ నేతలు విశ్లేషిస్తున్నారు. బుధవారం టీడీపీ తరపున కొత్తగా ఎంపికైన ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ఇందులో టీడీపీ ఎల్పీ నేతగా నారా చంద్రబాబు నాయుడును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
 
ఆ తర్వాత పార్టీ ఓటమికి గల కారణాలను కొత్త ఎమ్మెల్యేలు విశ్లేషించారు. అలాగే, జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్లాలా వద్దా అనే అంశంపై కూడా చర్చించారు. నిజానికి జగన్ ఆహ్వానం మేరకు ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్లేందుకు చంద్రబాబు సుముఖత వ్యక్తం చేయగా, పార్టీ నేతలు మాత్రం వారించారు. 
 
అది ఒక పార్టీ కార్యక్రమంలా జరుగుతుందని గుర్తుచేశారు. పైగా, రాజ్‌భవన్ వంటి ప్రాంతాల్లో నిర్వహించివుంటే వెళ్లి ఉండొచ్చని బహిరంగ ప్రదేశంలో పార్టీ కార్యక్రమంలా నిర్వహిస్తున్నందున వెళ్లొద్దని సూచించారు. దీంతో చంద్రబాబు ఈ కార్యక్రమానికి దూరంగా ఉండనున్నారు. 
 
అదేసయమంలో జగన్ నివాసానికి ఒక టీడీపీ బృందాన్ని అభినందనలు తెలపాలని నిర్ణయించారు. ఆ తర్వాత పార్టీ ఓటమికి గల కారణాలను నేతలు విశ్లేషిస్తూ, జగన్ ఒక్క ఛాన్స్ నినాదం బాగా పనిచేసింది సార్ అని చెప్పుకొచ్చారు. టీడీపీ ఎల్పీ సమావేశం తర్వాత టీడీపీ ఎంపీల సమావేశం జరిగింది.