1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 21 జనవరి 2022 (19:10 IST)

రోడ్లపై గుంతలు పూడ్చలేని జగన్, జిల్లాకో విమానాశ్రయం కడతాడ‌ట‌!

వైసిపి పాలనతో రాష్ట్ర ప్రజలు పూర్తిగా విసిగిపోయారని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. అన్ని వర్గాలు తీవ్ర అసంత్రుప్తి తో, అసహనంతో రగిలిపోతున్నాయని అన్నారు. ప్రభుత్వ పాలసీలు, పన్నులు, అధికారిక దోపిడీలతో ప్రతి ఒక్కరి జీవితాన్ని జగన్ ప్రభుత్వం దారుణంగా ప్రభావితం చేసిందని చంద్రబాబు అభిప్రాయ పడ్డారు. ఇప్పటికే కొన్ని వర్గాలు రోడ్డెక్కి నిరసనలు చేస్తున్నాయని, రానున్న రోజుల్లో ప్రజలు కూడా స్వచ్చంధంగా తిరగబడే పరిస్థితి వస్తుందని టిడిపి అధినేత అన్నారు. స్థానికంగా వైసిపి నేతలు, ఎమ్మెల్యేల దోపిడీ తీవ్రంగా ఉందని, వాటిపై మండల, నియోజవర్గ స్థాయి నుంచి నేతలు పోరాటాలు చెయ్యాలని పిలుపునిచ్చారు. 
 
 
మండల, నియోజకవర్గ పార్టీ నేతలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో పార్టీ సంస్థాగత అంశాలపైనా చంద్రబాబు చర్చించారు. ఇప్పటికీ కొన్ని చోట్ల పెండింగ్ లో ఉన్న గ్రామ, మండల స్థాయి కమిటీల నియామకం పూర్తి చెయ్యాలని ఆదేశించారు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా దొంగ ఓట్లు చేర్పించడం, ఒకే కుటుంబం ఓట్లను వేరు వేరు డివిజన్లకు మార్చడం వంటి చర్యలపై అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలకు సూచించారు. ప్రజా వ్యతిరేక విధానాలపై కొన్ని చోట్ల అనుకున్నంత ధాటిగా పోరాటాలు జరగడం లేదని....అలాంటి చోట్ల నేతలు పని తీరు మార్చుకోవాలని చంద్రబాబు అన్నారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణపై తన వద్ద పూర్తి సమాచారం ఉందని, టిడిపి మరింత దూకుడుగా వెళ్లాలని ఆయా వర్గాలు కోరుకుంటున్నాయని చంద్రబాబు అన్నారు.


ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైసిపికి దారుణ ఓటమి తప్పదని, ఈ విషయంలో వైసిపి వర్గాల్లోనే క్లారిటీ వచ్చిందని చంద్రబాబు అన్నారు. తమ కష్టాలు పోవాలంటే తెలుగు దేశం ప్రభుత్వం రావాలనే నిర్ణయానికి ప్రజలు వచ్చారని ఆయన అన్నారు. అయితే ఒక రాజకీయ పార్టీగా నిత్యం ప్రజా సమస్యలపై పారాటాలు చేస్తూనే ఉండాలని చంద్రబాబు దిశానిర్థేశం చేశారు. పిఆర్సి విషయంలో ప్రభుత్వం ఉద్యోగులను తీవ్రంగా మోసం చేసిందని, ఆ వర్గం చేస్తున్న పోరాటాలకు మద్దతు ఇవ్వాలని తెలిపారు. మనకు ఓటు వేశారా లేదా అనేది ఎప్పుడూ చర్చ కాదని.....బాధిత వర్గం ఎక్కడ ఉన్నా టిడిపి వారికి అండగా ఉంటుందనే పార్టీ సిద్దాంతమే ముఖ్యం అని నేతలకు తెలిపారు. జీతాలు పెంచమంటే, తగ్గించిన ప్రభుత్వం వైసిపి మాత్రమే అని చంద్రబాబు విమర్శించారు. రోడ్ల గుంతలను పూడ్చలేని జగన్, జిల్లాకో విమానాశ్రయం కడతా అని చెపుతున్నారని అన్నారు. 

 
ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కోవిడ్ రోగులకు మళ్లీ ఉచిత సేవలు మొదలు పెట్టినట్లు తెలిపారు. ట్రస్ట్ సౌజన్యంతో రోజూ అందుతున్న టెలిమెడిసిన్ సేవలను గ్రామ స్థాయి వరకు తీసుకువెళ్లాలని....ఈ పనిలో మండల, గ్రామ స్థాయి నేతలు వరకు భాగస్వాములు కావాలని సూచించారు. పార్టీ విభాగాలతో సమన్వయం చేసుకుని కోవిడ్ రోగులకు వైద్య పరంగా సహాయం చెయ్యాలని సూచించారు. ప్రభుత్వం చెయ్యకున్నా, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఉచిత వైద్య సాయంతో పాటు మందుల పంపిణీ కూడా చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. గత కోవిడ్ లో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అందిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసిన పలువురు నేతలు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరికి ధన్యవాదాలు తెలిపారు. 

 
జూమ్ కాల్ ద్వారా జరిగిన ఈ వీడియో కాన్ఫరెన్స్ లో మీరు ఎలా ఉన్నారంటూ నేతలు చంద్రబాబును అడిగారు. కోవిడ్ నుంచి వెంటనే కోలుకున్నానని, తాను పర్ఫెక్ట్ గా ఉన్నానని తెలిపారు. రెండో రోజు నుంచే యథావిధిగా ఆన్లైన్ ద్వారా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాని వారికి తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ లో టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.