1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , గురువారం, 20 జనవరి 2022 (18:11 IST)

రిటైర్డ్ ఉద్యోగుల మట్టి ఖర్చులను కూడా మిగుల్చుకోవడం అమానుషం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కాగ్ పొగిడిందని గొప్పలు చెప్పుకొన్న సీఎం జ‌గ‌న్ ప్ర‌భుత్వం, ఇపుడు ఉద్యోగుల పి.ఆర్.సి. విష‌యం వ‌చ్చేస‌రికి ఆర్థిక కష్టాలు అంటారా? అని జనసేన పిఎసి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమ‌ర్శించారు. సీఎం ఉద్యోగులను, ఉపాధ్యాయులను నిలువునా దగా చేసి ముఖం చాటేశార‌ని ఆరోపించారు. 
 
 
రిటైర్డ్ ఉద్యోగుల మట్టి ఖర్చులను కూడా మిగుల్చుకోవడం అమానుషం అని మ‌నోహ‌ర్ విమ‌ర్శించారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో, ఉపాధ్యాయుల్లో, పోలీసుల్లో ఆశలు రేపి ఇప్పుడు నిలువునా దగా చేసింద‌న్నారు. పి.ఆర్.సి. ద్వారా జీతాలు పెరుగుతాయని భావించిన ఉద్యోగుల నుంచి, ఇప్పటికే ఎక్కువ ఇచ్చాం కాబట్టి వెనక్కి ఇవాలని చెప్పిన పాలకులను ఎప్పుడూ చూడలేద‌న్నారు. జీతాల పెంపుదలపై పదేపదే సంఘాలను చర్చలకు పిలిచి ఉద్యోగులను, ఉపాధ్యాయులను మభ్యపెట్టార‌న్నారు. 
 
 
ప్రతి చిన్న విషయానికి ముందుకు వస్తూ, ముఖ్యమంత్రి తరఫున చర్చలు చేసే ప్రభుత్వ ప్రధాన సలహాదారు ఇప్పుడు ఎందుకు తప్పించుకొని దాక్కొన్నార‌ని ప్ర‌శ్నించారు. ఉద్యోగ సంఘాల నాయకులను ఫోన్ ద్వారా ‘కంట్రోల్’లో ఉండేలా చేసిన ఆ పెద్దమనిషి, ఇప్పుడు ఎందుకు ముఖం చాటేశారో ఉద్యోగులు నిలదీయాల‌న్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు కూడా పెన్షన్ తగ్గే విధంగా ప్రభుత్వం వ్యవహరించడం భావ్యం కాద‌న్నారు.