శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 31 మార్చి 2023 (19:02 IST)

ఆంధ్రా ప్యారీస్‌లో టీడీపీ కౌన్సిలర్లపై వైకాపా కౌన్సిలర్ల దాడి

tdp counucillors
ఆంధ్రా ప్యారీస్‌గా పేరుగాంచిన తెనాలిలో అధికార వైకాపా కౌన్సిలర్లు రెచ్చిపోయారు. వైకాపా కౌన్సిలర్లు, నేతలు పడుతున్న అవినీనితి టీడీపీ కౌన్సిలర్లు ప్రశ్నించారు. దీన్ని జీర్ణించుకోలేని వైకాపా కౌన్సిలర్లు టీడీపీ కౌన్సిలర్లపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన గుంటూరూ జిల్లాలోని తెనాలి మున్సిపల్ కార్పొరేషన్‌‍లో జరిగింది. స్థానికంగా కలకలం సృష్టించిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, 
 
తెనాలి మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలో టీడీపీ కౌన్సిలర్‌ యుగంధర్‌పై నలుగురు వైకాపా కౌన్సిలర్లు దాడికి పాల్పడ్డారు. నలుగురు కౌన్సిలర్ల నుంచి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరుతూ తెదేపా శ్రేణులతో కలిసి ఆయన తెనాలి 2వ పట్టణ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు. 
 
కౌన్సిలర్‌తో పాటు ఆందోళనలో పాల్గొన్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ.. ఆంధ్రా ప్యారిస్‌గా పేరుగాంచిన తెనాలిలో వైకాపా అరాచక శక్తులు పేట్రేగిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా అవినీతిని ప్రశ్నించిన పాపానికి తెదేపా కౌన్సిలర్‌ యుగంధర్‌పై దాడి చేయడం దుర్మార్గమన్నారు.
 
ప్రజాసమస్యలపై ప్రశ్నించాల్సిన చోట దాడులు చేయడమేంటని ప్రశ్నించారు. వైకాపా నేతల తీరు మార్చుకోకపోతే ప్రజల చేతిలో మూల్యం చెల్లించక తప్పదన్నారు. యుగంధర్‌పై దాడి చేసిన వారిపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో పోలీసులు కూడా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.