1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 28 జులై 2021 (03:41 IST)

ఒక రేషన్ కార్డుకు ఒకటే పింఛన్ విధానం: మంత్రి పేర్ని నాని

ఒక రేషన్ కార్డుకు ఒకటే పింఛన్ విధానాన్ని ప్రభుత్వం పక్కాగా అమలు చేయాలని నిర్ణయించిందని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని నాని తెలిపారు. తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల  పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను ఆయన ముఖాముఖిగా కలుసుకున్నారు.

ప్రజలు పడుతున్న ఇబ్బందులను గూర్చి అడిగి తెలుసుకొని ఎన్నో సమస్యలకు మంత్రి పేర్ని నాని అక్కడికక్కడే పరిష్కారం చూపించారు. తొలుత ఒక మహిళ మంత్రిని కలిసి తన సమస్య తెలిపింది.

తన తండ్రి చనిపోయారని తన తల్లికి పింఛన్ కావాలని, తన తల్లి అత్తగారు పింఛన్  పొందుతున్నారని వీరంతా ఒకే రేషన్ కార్డులో ఉన్నారని  ఈ ఇరువురిని రేషన్ కార్డులో వేరు చేస్తే రెండు పింఛన్ లు పొందవచ్చని ఆశపడుతున్నట్లుగా ఆమె తెలిపింది.

ఈ విషయమై మంత్రి పేర్ని నాని స్పందిస్తూ, ఒకే కుటుంబంలో రెండు పింఛన్లు తీసుకుంటుంటే ఒక పింఛన్‌ను రద్దు కాబడుతుందన్నారు. ఆధార్ కార్డు, ప్రజాసాధికార సర్వేల ఆధారంగా రాష్ట్రంలో ఒకే రేషన్ కార్డు మీద రెండు పింఛన్లు పొందుతున్న వారి వివరాలు ప్రభుత్వం ఇప్పటికే సేకరించిందని, ఒకే కుటుంబంలో రెండు పింఛన్లు తీసుకుంటే ఒక పింఛన్‌ను రద్దు చేయనున్నదని చెప్పారు.

దివ్యాంగ, కిడ్నీ వ్యాధిగ్రస్తుల (డయాలసిస్ రోగులు), డీఎమ్‌హెచ్‌వో(క్యాన్సర్, థలసీమియా, పక్షవాతం) పింఛన్లకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిందని తెలిపారు.

ఆధార్‌లో వయసు మార్పు చేసినవారు.. రేషను కార్డును పింఛనుకు అనుసంధానం చేయని వారు... ఒకే రేషన్‌కార్డు ద్వారా కుటుంబంలో రెండు లేదా అంతకు మించి పింఛన్లు ఉన్న వారిని గుర్తించి అనర్హులను క్షేత్ర స్థాయిలోనూ, సాంకేతికంగానూ పరిశీలించాకే తొలగింపు ఉంటుందని మంత్రి  చెప్పారు. తద్వారా మరికొంత మంది అర్హులకు పింఛన్లు అందించేందుకు అవకాశం ఉంటుందన్నారు.