శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: సోమవారం, 3 మే 2021 (19:11 IST)

లేడీయాంప్తిల్ కళాశాలలోని కోవిడ్ కేర్ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం: కరోనా బాధితుల కోసం స్థానిక లేడీయాంప్తిల్ కళాశాల హాస్టల్ నందు 50 బెడ్ లతో ఏర్పాటుచేసిన కోవిడ్ కేర్ సెంటర్‌ను రాష్ట్ర రవాణా, పౌర సంబంధాల సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె మాధవి లతతో కలిసి ప్రారంభించారు.
 
సోమవారం మధ్యాహ్నం ఆయన కోవిడ్ కేర్ సెంటర్ ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 250 బెడ్ లతో కరోనా బాధితులకు వైద్యం మొదలుపెట్టి నేడు 400 బెడ్ లకు పైగా పెంచి వైద్యం అందిస్తున్నామని అయినా కరోనా బాధితులు రోజురోజుకు పెరిగిపోవడంతో మంచాలు చాలక ఈ కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేశామని, ఈ కోవిడ్ కేర్ సెంటర్లలో ఆక్సిజన్ అవసరం లేని వారు, హోమ్ ఐసోలేషన్లో ఉండడానికి అవకాశం లేనివారు ఇక్కడ చికిత్స పొందవచ్చని తెలిపారు.

అలాగే వైద్యం అవసరం ఉన్నవారు మాత్రమే ఈ కోవిడ్ కేర్ సెంటర్లకు రావాలని అని ఆయన బాధితులను కోరారు. అనంతరం ఆయన కరోనా బాధితుల కోసం ఏర్పాటు చేసిన సదుపాయాలను జాయింట్ కలెక్టర్ తో కలిసి పరిశీలించారు. పల్స్ ఆక్సి మీటర్లు, మినీ ఆక్సిజన్ సిలిండర్లు, మంచాలను, గదులను పరిశీలించారు.
 
కోవిడ్ కేర్ సెంటర్‌కు రెండు లక్షల రూపాయలను అందించిన కొండపల్లి శివరామకృష్ణ, పెదబాబు:
స్థానిక వి ఆర్ వో లు గా పనిచేస్తున్న కొండపల్లి శివరామకృష్ణ, కొండపల్లి పెద్ద బాబులు కోవిడ్ కేర్ సెంటర్లోని కరోనా బాధితులకు వైద్యం నిమిత్తం రెండు లక్షల రూపాయలను వారు మంత్రి పేర్ని నానికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని, జాయింట్ కలెక్టర్ మాధవి లతలు చేసిన సహాయానికి వారిని అభినందించారు.
 
ఈ కార్యక్రమంలో బందరు ఆర్ డి ఓ ఎన్ఎస్కె ఖాజావలి, డిఆర్ డి ఎ పిడి శ్రీనివాసరావు, తాసిల్దార్ డి సునీల్ బాబు, డాక్టర్ ప్రవీణ డాక్టర్ మాధురి డాక్టర్ హరి, వి ఆర్ వో లు, సచివాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.