1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: శనివారం, 7 ఆగస్టు 2021 (16:41 IST)

ఆరు నెల‌ల నుంచి 60 ఏళ్ళ వ‌ర‌కుఎవ‌రికీ ర‌క్ష‌ణ లేదు!

మహిళలకు భద్రత కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం ఘోర వైఫల్యం అయింద‌ని, 50 రోజులైనా సీతానగరం ఘటనా నిందితులను పట్టుకోలేకపోవడం జగన్మోహన్ రెడ్డి చేతకానితనానికి నిదర్శనమ‌ని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమ‌ర్శించారు.

మహిళలకు రక్షణ కల్పించలేని జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రాన్ని పాలించే హక్కు లేద‌న్నారు. ముఖ్యమంత్రి నివాసానికి సమీపంలో మహిళపై అత్యాచారం జరిగితే నేటికీ నిందితుల్ని పట్టుకోలేని చేతకాని దద్దమ్మ ప్రభుత్వమిదని విమ‌ర్శించారు.
 
మహిళకు భద్రత ఇవ్వలేని ఈ ప్రభుత్వం ఎందుకు? దిశా చట్టం, దిశా యాప్ పేరుతో సాక్షి పత్రికలో కోట్ల రూపాయిల ప్రజాధనంతో ప్రకటనలు ఇవ్వడంపై ఉన్న శ్రద్ధ...మహిళలకు రక్షణ కల్పించడంలో లేదా? జగన్మోహన్ రెడ్డి పాలనలో 6 నెలల పసికందు నుంచి 60 ఏళ్ల వృద్ధురాలి వరకూ రక్షణ లేదు. ఆడబిడ్డకు కష్టమొస్తే గన్ను కంటే ముందు వస్తాడన్న జగన్ తాడేపల్లి ప్యాలెస్ లో దాక్కోవడం వల్లే మృగాళ్లు రెచ్చిపోతున్నారు. మహిళలను ముట్టుకుంటే మరణశిక్షేనని ప్రచారార్భాటం చేసిన ముఖ్యమంత్రి ప్యాలెస్ నుంచి బయటకు రావాలి అని డిమాండు చేశారు. 
 
మంగళగిరిలో  మహిళపై ఆటో డ్రైవర్ దాడి చేస్తే రక్షించే దిక్కులేదు ఈ రాష్ట్రంలో. ఆ మహిళను ఆటో డ్రైవర్ కాలితో ఎగిరి తన్నాడంటే వాడికి అంత ధైర్యం ఎక్కడినుంచి వచ్చింది? రాజారెడ్డి రాజ్యాంగంలో ఏం చేసినా చెల్లుతుందనే అహంభావంతోనే ఆటో డ్రైవర్ రెచ్చిపోయాడు.  తనపై దాడి విషయాన్ని బాధితురాలే ఫోన్ చేసి చెప్పేదాకా పోలీసులకు తెలీదంటే రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఎంత బాగా పనిచేస్తోందో అర్ధం చేసుకోవచ్చు. ఘటన జరిగి 24 గంటలు గడిచినా ఆటో డ్రైవర్ పై చర్యలు ఎందుకు తీసుకోలేదు? దిశ చట్టంతో మహిళల దశా,దిశా  మార్చేస్తామన్నారుగా? ఎక్కడుంది దిశా? మహిళా భద్రత విషయంలో జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ది లేద‌న్నారు.
 
ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న టీడీపీ నేతలపై కేసులు పెట్టి వేధించడంపై  ఉన్న శ్రద్ధ ముఖ్యమంత్రికి మహిళా భధ్రత విషయంలో లేకపోవడం సిగ్గుచేటు. ఏదో ఘటన జరిగినప్పుడు పరామర్శించి చేతులు దులుపుకోడానికేనా ఏపీ మహిళా కమిషన్ ఏర్పాటు చేశారా? మహిళా హోంమంత్రి ఉన్న రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకపోవడం బాధాకరమ‌న్నారు.