1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: బుధవారం, 26 మే 2021 (16:08 IST)

జూన్ 1వ తేదీ నుంచి అలిపిరి మెట్ల మార్గం మూత, ఎందుకు?

అలిపిరి మెట్లమార్గం. తిరుపతికి వచ్చే భక్తులు మ్రొక్కులు సమర్పించుకునేందుకు మెట్ల మార్గం ద్వారా తిరుమలకు వెళుతుంటారు. తిరుపతికి వచ్చే భక్తుల్లో ఎక్కువమంది తిరుపతిలోని అలిపిరి పాదాలమండపం నుంచే తిరుమలకు వెళుతుంటారు. ఎక్కువ  సమయం ఉన్నా సరే అదే మెట్ల మార్గాన్ని ఎంచుకుంటూ ఉంటారు.
 
అంతేకాదు తక్కువ సమయంలో వెళ్ళాలనుకునేవారు మాత్రం శ్రీవారి మెట్టు మార్గాన వెళుతుంటారు. అయితే అలిపిరి కాలినడక మార్గాన్ని జూన్ 1వతేదీ నుంచి మూసివేయనున్నారు. తాత్కాలికంగా మెట్ల మార్గాన్ని మూసివేస్తున్నట్లు టిటిడి చెబుతోంది. అలిపిరి కాలినడక మార్గంలో పైకప్పు పునర్నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకే  ఈ నిర్ణయం తీసుకున్నట్లు టిటిడి చెబుతోంది.
 
అయితే జూన్ 1వతేదీ నుంచి కాలినడకన తిరుమలకు వెళ్ళాలనుకునే భక్తులు శ్రీవారి మెట్టు మార్గం ద్వారా వెళ్ళాలని కోరుతోంది. అందుకోసం అలిపిరి నుంచి శ్రీవారి మెట్టు వరకు ఉచిత బస్సుల ద్వారా భక్తులను తరలించేందుకు టిటిడి ఏర్పాట్లు కూడా చేస్తోంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టిటిడికి సహకరించాలని కోరుతోంది.