1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: సోమవారం, 17 మే 2021 (20:29 IST)

గుప్తనిధుల కోసం శేషాచలం కొండలనే తవ్వేసిన ఘనుడు

శేషాచలం అంటే గుర్తుకువచ్చేది తిరుమల వేంకటేశ్వరస్వామి. శ్రీనివాసుడు కొలువై ఉన్న స్థలం శేషాచలం. అలాంటి ప్రాంతంలో ఎప్పుడూ అటవీశాఖ సిబ్బంది పర్యవేక్షణ ఉంటుంది. ఎంతో జాగ్రత్తగా కొండలను కాపాడుకుంటూ వస్తున్నారు. శేషాచల వాసా గోవిందా అంటూ నామస్మరణలను కూడా భక్తులు చేస్తుంటారు.
 
అలాంటి ప్రాంతంలో ఒక వ్యక్తి ఏకంగా గుప్త నిధుల కోసం శేషాచలం కొండలనే త్రవ్వేశాడు. సంవత్సరం పాటు ఈ తతంగం మొత్తం సాగుతోంది. అది కూడా భారీ త్రవ్వకాలు చేసినట్లు  పోలీసులు గుర్తించారు. 80 అడుగుల సొరంగం వెలుగు చూసింది. అయితే నిందితుడు మంకు నాయుడును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 
అలాగే అతనికి సహాయం చేసిన మరో ఆరుగురు కూలీలను అదుపులోకి తీసుకున్నారు అలిపిరి పోలీసులు. కొండల్లో గుప్త నిధులు ఉన్నాయని ఒక స్వామీజీ చెప్పడంతో సొరంగం త్రవ్వినట్లు అంగీకరించాడు నిందితుడు మంకునాయుడు. నిందితుడిని వెంటబెట్టుకుని సొరంగంను తనిఖీ చేశారు పోలీసులు.
 
కొండ లోపల 80 అడుగుల భారీ సొరంగాన్ని చూసి అవాక్కయ్యారు పోలీసులు. ఏడాది కాలంగా రహస్యంగా సొరంగం త్రవ్వకం సాగుతున్నట్లు గుర్తించారు. అసలు పోలీసులు, అటవీశాఖాధికారులు, టిటిడి విజిలెన్స్ కన్నుగప్పి ఇంతటి భారీ సొరంగం ఎలా త్రవ్వారన్న అంశంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.