1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 4 జులై 2021 (12:44 IST)

తిరుపతిలో దారుణం : సోదరిపై అన్న అత్యాచారం... ఐదు నెలల గర్భం

తిరుపతిలో ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. వరుసకు చెల్లెలైన బాలికను బెదిరించి ఓ బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన శనివారం రాత్రి తిరుపతిలో వెలుగు చూసింది. బాలిక గర్భవతి కావడంతో ఈ అంశం వెలుగులోకి వచ్చింది. 
 
తిరుపతి పట్టణానికి చెందిన ఓ వ్యక్తి చంద్రగిరి మండలానికి చెందిన మహిళను వివాహం చేసుకున్నాడు. కొడుకు పుట్టిన కొన్నాళ్లకే ఆ మహిళ భర్త నుంచి విడిపోయింది. మరొకరిని వివాహం చేసుకుని కుమారుడితో పాటు తిరుపతిలోని వడమాలపేటలో నివాసముంటోంది. 
 
అయితే, మొదటి భార్యతో విడిపోయిన తర్వాత ఆ వ్యక్తి ఆమె చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు పుట్టారు. ఈ ఇద్దరిలో రెండో కుమార్తె వయస్సు 14 సంవత్సరాలు. 
 
అయితే, మొదటి భార్య కుమారుడు(16) అప్పుడప్పుడూ తిరుపతిలోని తన తండ్రి, చిన్నమ్మ ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో ఐదు నెలలక్రితం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో తన చెల్లెలైన పధ్నాలుగేళ్ల బాలికను బెదిరించి అత్యాచారం చేశాడు. 
 
ఆ తర్వాత కొన్నాళ్లకు మళ్లీ ఆమెపై అత్యాచారానికి తెగబడ్డాడు. అతడి బెదిరింపులకు భయపడిన ఆ బాలిక ఈ విషయాలను తల్లిదండ్రులకు చెప్పలేదు. ఈ క్రమంలో బాలిక గర్భవతి అయింది. 
 
ఆమె శరీరంలో కలుగుతున్న మార్పులను గుర్తించిన బాలిక తల్లి ఆమెను ప్రశ్నించగా... అసలు విషయాన్ని బయటపెట్టింది. దీంతో ఆమె తల్లి చైల్డ్‌కేర్‌ ప్రతినిధులకు విషయాన్ని తెలియజేయడంతో వారు అలిపిరి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు పోక్సో చట్టంకింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.