సోమవారం, 17 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 16 నవంబరు 2025 (20:13 IST)

18న ఫిబ్రవరి నెల శ్రీవారి ఆర్జిత సేవల టిక్కెట్ల కోటా రిలీజ్

venkateswara swamy
వచ్చేయేడాది ఫిబ్రవరి నెల కోటా శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించిన టిక్కెట్లను ఈ నెల 18వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ టిక్కెట్లను ఆన్‌లైన్‌లో రిలీజ్ చేయనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) అధికారులు వెల్లడించారు. శ్రీవారి ఆర్జిత సేవల ఎలక్ట్రానిక్‌ లక్కీడిప్‌ కోసం 20న ఉదయం పది గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. 
 
అంగప్రదక్షిణ టోకెన్లను ఇదే విధానంలో నమోదు చేసుకున్నాక ఎలక్ట్రానిక్‌ డిప్‌ ద్వారా జారీ చేస్తారు. లక్కీడిప్‌లో టికెట్లు పొందిన భక్తులు 22వ తేదీ మధ్యాహ్నంలోపు సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. 21న ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్లు, వర్చువల్‌ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటా మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు.
 
ఈ నెల 24వ తేదీన ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్‌ దర్శన టికెట్ల కోటా, మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, దివ్యాంగులకు ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్ల కోటాను విడుదల చేస్తారు. 25న ఉదయం పదింటికి ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్ల కోటా, మధ్యాహ్నం మూడింటికి అద్దె గదుల బుకింగ్‌ కోటా అందుబాటులో ఉంటుంది. భక్తులు  https://ttdevasthanams.ap.gov.in లో మాత్రమే ఆర్జితసేవలు, సేవా టికెట్లను బుక్‌ చేసుకోవాలని తితిదే సూచించింది.