గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 3 సెప్టెంబరు 2024 (16:39 IST)

బుడమేరుకు గేట్లు ఉన్నాయట.. జగన్‌పై సీఎం చంద్రబాబు ఆగ్రహం

chandrababu
బుడమేరు గేట్లు ఎత్తివేయడం వల్ల, మ్యాన్ మేడ్ డిజాస్టర్ అంటూ సోమవారం వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించిన వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుడమేరుకు గేట్లు ఎత్తివేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిదంటూ చేసిన వ్యాఖ్యలే జగన్ అజ్ఞానానికి నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏనాడైనా జగన్ ఫీల్డ్‌లోకి వచ్చారా? అని ప్రశ్నించారు. వైసీపీ హయాంలో ఒకసారి వరదలు వచ్చినప్పుడు రెడ్ కార్పెట్‌పై సందర్శించారని మండిపడ్డారు. ఇప్పుడు విధిలేని పరిస్థితుల్లో బురదలోకి దిగారని ఎద్దేవా చేశారు.
 
బుడమేరుకు గేట్లు ఉన్నాయని జగన్ అంటున్నారని... బుడమేరుకు గండ్లు పడ్డాయనే విషయం కూడా వాళ్లకు తెలియదని విమర్శించారు. మా ఇంటిని కాపాడుకోవడానికి బుడమేరుకు నీటిని పంపించామని జగన్ అంటున్నారని... ఎంత అజ్ఞానంతో మాట్లాడుతున్నాడో అని దుయ్యబట్టారు. ఏం చెప్పినా జనాలు వింటారనే భావనలో ఉన్నారని అన్నారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్న సమయంలో వెకిలిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వరదల గురించి మాట్లాడే అర్హత కూడా జగన్‌కు లేదని అన్నారు.
 
రెండు బోట్లు కొట్టుకొచ్చి ప్రకాశం బ్యారేజీని ఢీకొన్నాయని... ఓ విధంగా ఇది ప్రమాదమే అయినప్పటికీ, దీని వెనుక కుట్ర ఉందని ఎంతో మంది అనుమానిస్తున్నారని చంద్రబాబు చెప్పారు. క్రిమినల్స్ రాజకీయాల్లో ఉంటే ప్రజలకు రోజూ అనుమానాలే వస్తాయని అన్నారు. సొంత బాబాయ్‌ని హత్య చేసి గుండెపోటు అని చెప్పిన వాళ్లు ఏమైనా చేస్తారని వ్యాఖ్యానించారు. రేపల్లె వద్ద ఉన్న బండ్‌కు ఈ క్రిమినల్స్ గండ్లు పెడతారనే అనుమానంతో పోలీస్ పెట్రోలింగ్ పెట్టామని తెలిపారు.
 
అమరావతి మునిగిపోయిందంటూ వైసీపీ, నీలి మీడియా పనికట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంత పనికిమాలిన పార్టీని ఎప్పుడూ చూడలేదని అన్నారు. బుడమేరుకు పడ్డ గండ్లను గత వైసీపీ హయాంలో పూడ్చలేదని... ఈ కారణం వల్లే కట్టలు తెగి సింగ్ నగర్‌ను పూర్తిగా ముంచేసిందని చెప్పారు.