శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: శుక్రవారం, 30 జులై 2021 (20:40 IST)

లక్షకు పైగా రైతులను సలహా మండళ్ల ద్వారా భాగస్వాములను చేసాం: మంత్రి కన్నబాబు

లక్ష మందికి పైగా రైతులు వ్యవసాయ సలహా మండళ్ల ద్వారా ప్రభుత్వానికి వ్యవసాయాభివృద్ధిపై  సలహాలు ఇస్తూ అభివృద్ధిలో బాగస్వాములవుతున్నారని వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల వ్యవసాయ సలహా మండళ్ల  చైర్మన్లతో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి అవగాహన  సదస్సులో ముఖ్య అతిధిగా పాల్గొన్న మంత్రి కన్నబాబు ఈ మండళ్ల గురించి మాట్లాడారు. నాలుగు అంచెలు గ్రామ, మండల, జిల్లా మరియు రాష్ట్ర స్థాయిల్లో ఏర్పాటు చేసిన వ్యవసాయ సలహా మండళ్ల సహకారంతో రాష్ట్ర వ్యవసాయరంగం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.
 
రైతుకు సముచిత గౌరవం ఇస్తూ రైతునే చైర్మన్ గా నియమించాలని సీఎం  ఆదేశించారని మంత్రి తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు వ్యవసాయ మండళ్లను  అన్ని వ్యవసాయ అంశాల్లోనూ భాగస్వాములను చేస్తున్నామని కన్నబాబు చెప్పారు. వ్యవసాయ సేవలను రైతులకు  మరింత చేరువుగా, మెరుగ్గా అందాలనే సదుద్దేశంతో  సీఎం వ్యవసాయ సలహా మండళ్లను ఏర్పాటు  చేశారని ఈ సందర్బముగా చెప్పుకొచ్చారు.

సుమారు లక్ష మందికి  పైగా అనుభవం వున్న రైతులు వ్యవసాయంపై  ఈ మండళ్ల ద్వారా ప్రభుత్వానికి విలువైన సలహాలు ఇస్తున్నారని చెప్పారు. మండళ్ల సమావేశాలు క్రమం తప్పకుండా, క్రమశిక్షణతో నిర్వహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు . ప్రతి సమావేశంలో అంశాలను రికార్డు చేయాలనీ, సంబంధిత వ్యవసాయ అధికారులు బాద్యతాయుతంగా ఉండాలని మంత్రి కోరారు. వ్యవసాయ, ఉద్యాన, సహకార, పట్టుసాగు, చేపలు రొయ్యల పెంపకం, సహకార తదితర అన్ని అంశాల్లో మండళ్లు తమ సూచనలను అందిస్తే వాటిని సీఎం దృష్టికి తీసుకువచ్చి మరింత వ్యవసాయాభివృది చేయొచ్చన్నారు.

దేశంలోని ఏ రాష్ట్రంలోని అమలు చేయని వ్యవసాయ, సంక్షేమ పథకాలను కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా మన సీయం జగన్ దిగ్విజయంగా అమలు చేస్తున్నారని  చెప్పారు. సాగు చేసే ప్రతి పంట ఈ క్రాప్ లో రిజిస్టర్ చేయించాలని, ఇది రైతుతో పాటూ మనందరి ప్రధాన బాధ్యత, అందుకు తగిన సదుపాయాలను ఆర్బీకేల్లో కల్పించామన్నారు. బోర్ల కింద వరి పండించకుండా రైతులకు అవగాహనా కల్పించాలని అయన కోరారు.

ఈ  క్రాప్ మరియు సీఎం అప్ లను మరింత సరళీకృతం చేసి రైతులకు సులువుగా ఉండేలా చేస్తామన్నారు. అనంతరం వ్యవసాయ సలహా మండళ్ల  ఆవిర్భావం, ఉద్దేశ్యాలు, బాధ్యతలు తదితర అంశాలపై  వివిధ శాఖల ఉన్నతాధికారులు అవగాహన కల్పించారు. పంటల ప్రణాళిక, డిమాండ్ మేరకు ఉత్పత్తి, పంటల మార్పు, రైతులకు ఆర్బీకేలో అందుతున్న సేవలు, మార్కెట్ ఇంటలిజెన్స్, వాతావరణ పరిస్థితులు, FPO ల సుస్థిరత తదితర అంశాలపై సలహాలు ఇస్తూ రైతుల్ని చైతన్య పరచాలని ఇతర వక్తలు మండళ్ల చైర్మన్లకు పలు సూచనలు చేశారు.
 
స్పెషల్ సెక్రెటరీ పూనమ్ మాలకొండయ్య , రాష్ట్ర వ్యవసాయ మిషన్ చైర్మన్ నాగిరెడ్డి, కమిషనర్లు అరుణ్ కుమార్, ప్రద్యుమ్న, శ్రీధర్, అహ్మద్ బాబు, కన్నబాబు, శేఖర్ బాబు, శ్రీకంఠనాథరెడ్డి,
ఆగ్రోస్ ఎండి కృష్ణ మూర్తి, సీడ్స్ సర్టిఫికేషన్ డైరెక్టర్ త్రివిక్రమరావు, పశుసంవర్ధక శాఖ అడిషనల్ డైరెక్టర్ అమరేంద్ర, 13 జిల్లాల వ్యవసాయ సలహా మండళ్ల చైర్మన్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.