మంగళవారం, 10 జూన్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

అమరావతి మహిళలు వేశ్యలా.. ఆ వ్యాఖ్యలు చేసిన వ్యక్తి బెండు తీయండి...

chandrababu
అమరావతి మహిళలను వేశ్యలతో ఇద్దరు పాత్రికేయులు పోల్చడంపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలను ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. 
 
కాగా, తాజాగా వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి టీవీ చానెల్‌లో జరిగిన చర్చలో కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాస రావు అనే ఇద్దరు పాత్రికేయులు పాల్గొని అమరావతి మహిళలను ఉద్దేశించి తీవ్ర అభ్యంతరకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు మండిపడ్డారు. 
 
రాజధాని గురించి, అక్కడి మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా 'వేశ్యలు' అంటూ చేసిన దారుణమైన వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ఆయన స్పష్టంచేశారు. రాజకీయ, మీడియా ముసుగులో సాగుతున్న ఇలాంటి వికృత చేష్టలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
 
'తన సొంత మీడియా చానల్ ద్వారా జరిగిన ఈ దారుణాన్ని ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇప్పటికీ ఖండించకపోవడం, స్త్రీ జాతికి క్షమాపణ చెప్పకపోవడం మరింత విచారకరం. ఆడబిడ్డలను గౌరవించే సంస్కృతి మనది. స్త్రీమూర్తులను ఆరాధించే సమాజం మనది. ఇది మన సంప్రదాయం. మన భారతీయ జీవన విధానం. ముఖ్యంగా మన తెలుగు ప్రజల విషయానికి వస్తే ఆడబిడ్డను, అమ్మను ఎంతో ఆదరణతో చూస్తాం. అలాంటి మన రాష్ట్రంలో రాజకీయ కక్షతో, మీడియా విశ్లేషణల పేరుతో నిస్సిగ్గుగా ఏకంగా మన తల్లులు, చెల్లెళ్లపై దారుణ వ్యాఖ్యలు చేయడం క్షమించరాని నేరం.
 
వాళ్లు ఎప్పుడూ అనుసరించే ఈ విష సంస్కృతిపై తిరుగుబాటుగా గత ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చినా వారి వైఖరిలో మార్పు రాలేదనేది సుస్పష్టం. రాజధానిపై విషం చిమ్మే కుట్రలో గట్టు దాటి మహిళల మనోభావాలను గాయపరచిన వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటాం. గత విధ్వంస ప్రభుత్వంపై రాజధాని మహిళల పోరాటాన్ని మనసులో పెట్టుకుని ఆ ప్రాంత మహిళలపై ఉద్దేశ్యపూర్వకంగా, నీచాతినీచంగా చేసిన ఈ వ్యాఖ్యలు మొత్తం మహిళా సమాజాన్నే అవమానించడం. మహిళలను గౌరవించే, వారి ఆత్మగౌరవానికి అండగా నిలిచే కూటమి ప్రభుత్వం ఈ నీచ సంస్కృతికి చెక్ పెట్టే బాధ్యత తీసుకుంటుంది' అని చంద్రబాబు పేర్కొన్నారు.