మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: శనివారం, 24 జులై 2021 (11:43 IST)

వివేకా హ‌త్య‌కు రూ.8 కోట్లు సుపారీ ఇచ్చిందెవ‌రు?

ఏపీ సీఎం జగన్ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హ‌త్య కేసు చివ‌రికి ఎవ‌రి మెడ‌కు చుట్టుకుంటుందో అని ఉత్కంఠ నెల‌కొంది. ఆయ‌న కేసు విచార‌ణ‌లో సీబిఐ ఇపుడు చురుకుగా అడుగులు ముందుకు వేస్తోంది. దీనితో మిస్టరీ హ‌త్య కేసు ముడి  వీడుతున్న‌ట్లు తెలుస్తోంది.

సుమారు రెండు నెలలుగా సీబీఐ అధికారులు అనుమానితులందరినీ లోతుగా దర్యాప్తు చేస్తుండడంతో కీలక విషయాలు బయటపడినట్లు తెలుస్తోంది. వివేకా మర్డర్ కి సంబంధించి కీలక ఆధారాలు సేకరించినట్లు సమాచారం.

ఈ కేసులో ప్రధానం ఆరుగురు వ్యక్తులను సీబీఐ పదేపదే ప్రశ్నించి కీలక వివరాలు రాబట్టినట్లు తెలుస్తోంది. వివేకా అనుచరుడు ఎర్రగంగి రెడ్డి, పీఏ కృష్ణా రెడ్డి, డ్రైవర్ దస్తగిరి, పులివెందులకి చెందిన కృష్ణయ్య కుటుంబం, వాచ్మెన్ రంగన్న, ఇనాయతుల్లాను సీబీఐ అధికారులు పలుమార్లు విచారించారు.
 
సీబీఐ విచారణలో వాచ్ మ‌న్ రంగన్న సంచలన విషయాలు చెప్పినట్లు తెలుస్తోంది. జమ్మలమడుగు మేజిస్ట్రేట్ ఎదుట రంగయ్య స్టేట్మెంట్ రికార్డు కూడా చేసినట్లు సమాచారం. వైఎస్ వివేకానంద రెడ్డిని సుపారీ గ్యాంగ్ హత్య చేసినట్లు చెప్పినట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా ఆయన హత్యకు రూ.8 కోట్లు సుపారీ ఇచ్చారని.. తొమ్మిది మంది హత్య ప్రమేయం ఉన్నట్లు రంగన్న చెప్పాడని తెలుస్తోంది. హత్య జరిగిన రోజు ఇంటికి ఐదుగురు కొత్త వ్యక్తులు వచ్చినట్లు స్టేట్మెంట్ పేర్కొన్నట్లు సమాచారం.
 
ఇద్దరు ప్రముఖుల హస్తం కూడా ఉందని రంగన్న చెప్పినట్లు తెలుస్తోంది. రహస్యంగా వాచ్మెన్ స్టేట్మెంట్ రికార్డు చేసిన సీబీఐ అధికారులు ఆ దిశగా దర్యాప్తు ముమ్మరం చేసినట్లు సమాచారం. ఇంతకీ ఆ ఇద్దరు ప్రముఖులెవరన్నదీ సస్పెన్స్ మారింది. త్వరలోనే ఈకేసు కొలిక్కి వస్తుందని తెలుస్తోంది.