గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 22 సెప్టెంబరు 2022 (14:34 IST)

భార్య ఇచ్చిన మజ్జిగ ఆ భర్త ప్రాణం తీసింది...

భార్య ఇచ్చిన మజ్జిగతో ఆ భర్త ప్రాణం పోయింది. ఏదో భార్య ప్రేమగా ఇచ్చిందని మజ్జిగ తాగిన పాపానికి భర్త ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన కోనసీమ జిల్లాలో చోటుచేసుకుంది. విచిత్రం ఏంటంటే.. సంఘటన జరిగిన 3 నెలల తర్వాత ఈ ఘటనలో జరిగిన పరిణామాలు చూసి పోలీసులు సైతం షాకయ్యారు.
 
వివరాల్లోకి వెళితే..కోనసీమ జిల్లాలోని కె.గంగవరం మండలంలో బాలాంత్రం గ్రామానికి చెందిన కోలా సుబ్బారావు, కాజులూరు మండలం ఉప్పుమిల్లి గ్రామానికి చెందిన సత్య వెంకటలక్ష్మీలకు 2009లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. వీరి జీవితం అంతా సాఫీగానే సాగిపోతుంది. 
 
అయితే ఈ ఏడాది జూన్ 1వ తేదిన సత్య వెంకటలక్ష్మీ తన భర్తకు నిద్రమాత్రలు కలిపిన మజ్జిగను ఇచ్చింది. ఈ ప్రభావంతో భర్త నిద్రలోనే చనిపోయాడు. తెల్లవారేసరికి తన భర్తకు గుండె పోటు వచ్చిందని నమ్మబలికింది. సుబ్బారావు తోబుట్టువులు, బంధువులు నిజమనే అనుకున్నారు. దహన సంస్కారాలు, అంతిమ కార్యక్రమాలను నిర్వహించేశారు. 
 
భర్త చనిపోయిన మూడు నెలలకే సత్యవెంకటలక్ష్మీ ప్రవర్తనలో పూర్తిగా మార్పు వచ్చింది. ఓ వ్యక్తితో చనువుగా ఉండటాన్ని ఆమె భర్త బంధువులు గమనించారు. అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
వెంకట లక్ష్మికి గతంలోనే అదే ప్రాంతానికి చెందిన ఉసిరి శ్రీనివాస్‌తో అక్రమ సంబంధం ఉందని తేలింది. ప్రియుడి మోజులో పడి పచ్చని సంసారాన్ని పొగొట్టుకున్న సత్యవెంకటలక్ష్మీ ప్లానింగ్‌కు అంతా షాక్ అయ్యారు. భర్తకు మజ్జిగలో నిద్ర మాత్రలు కలిపి ఇచ్చి అతడ్ని చంపేయడంతో పాటు, ప్రియుడి సహాకారం తీసుకున్నందుకు ఇద్దరిపైనా హత్య కేసు నమోదు చేశారు.