శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 14 డిశెంబరు 2018 (13:42 IST)

వాడితో పలుకుతోంది.. అందుకే చంపేశా : స్టాఫ్ నర్స్ హత్య కేసులో భర్త వాంగ్మూలం

వెస్ట్ గోదావరి జిల్లాలో జరిగిన స్టాఫ్ నర్స్ హత్య కేసులో కట్టుకున్న భర్తే అసలు నిందితుడని పోలీసులు వెల్లడించాడు. స్టాఫ్ నర్సుగా పని చేస్తున్న భార్య మరో వ్యక్తితో పలుకుతుందని అనుమానించిన భర్త చివరకు భార్యను కత్తితో పొడిచి చంపేశాడు. ఈ కేసులో భర్తను పోలీసులు అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, వెస్ట్ గోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం అంతర్వేదిగూడెంకు చెందిన కె.సత్యవతి, పందరిమామిడిగూడెంకు చెందిన తాటిమళ్ళ లెనిన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 12 యేళ్లపాటు కాపురం చేశారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 
 
బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన సత్యవతి కాంట్రాక్టు పద్ధతిలో ఐటీడీఏ పరిధిలోని పీహెచ్‌సీలో స్టాఫ్ నర్సుగా పని చేస్తోంది. భర్త లెనిన్ మాత్రం ఎలక్ట్రానిక్ మీడియాలో పని చేస్తున్నాడు. వీరిద్దరూ కలిసి జంగారెడ్డిగూడెంలో కాపురం పెట్టారు. సాఫీగా సాగిపోతున్న వీరి కాపురంలో అనుమానం పెనుభూతమైంది. 
 
కట్టుకున్న భార్య పరాయి వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానం భర్తలో బలపడింది. ఆ తర్వాత భార్యాభర్తల మధ్య పలుమార్లు గొడవలు జరుగగా, పోలీస్ స్టేషన్ వరకు వెళ్లాయి కూడా. ఈ నేపథ్యంలో ఈనెల 10వ తేదీన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న సత్యవతి... బుధవారం అంతర్వేదిగూడెంలోని ఇంటికి వెళ్లింది. గురువారం ఉదయం విధులకు వెళ్లేందుకు ఇంటి నుంచి బయలుదేరింది. 
 
జంక్షన్ ప్రాంతమైన బుట్టాయగూడెం బస్టాండ్ వెనుక ఉన్న త్రిశక్తి పీఠం సమీపంలో భర్తను కలుసుకుంది. అక్కడ వారిద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో పొడవడంతో తీవ్ర రక్తస్రావం కావడంతో సత్యవతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. నిందితుడైన భర్తను అరెస్టు చేశారు.