శుక్రవారం, 7 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 31 జనవరి 2025 (13:46 IST)

మోడీ మాస్టర్ ప్లాన్.. బీజేపీలో వైకాపా విలీనం!!?

bjp - ycp
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాస్టర్ ప్లాన్ వేశారు. ఏపీలోని విపక్ష వైకాపాను తమ పార్టీలో విలీనం చేసుకునే దిశగా పావులు కదపుతున్నారు. దీనికి వైకాపాకు చెందిన పలువురు ఎంపీలు సైతం సమ్మతించినట్టు సమాచారం. ఇలా చేయడం వల్ల తమ పదవులకు ఎలాంటి ఢోకా ఉండదని, అందువల్ల వైకాపాను బీజేపీలో విలీనం చేసేందుకు సిద్ధమేనని వారు బీజేపీ అగ్రనాయకుల వద్ద వ్యాఖ్యానించినట్టు సమాచారం. 
 
2024లో జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో వైకాపా చిత్తుగా ఓడిపోయింది. దీంతో ఆ పార్టీకి చెందిన అనేక మంది ప్రజాప్రతినిధులు ఇతర పార్టీల్లో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా, బీజేపీలో చేరేందుకు మెజార్టీ నేతలు ఇష్టపడుతున్నారు. ఎందుకంటే వైకాపా నేతలను టీడీపీ లేదా జనసేన పార్టీలు చేర్చుకునేందుకు ఏమాత్రం ఇష్టపడటం లేదు. దీంతో పార్టీ మారాలని భావిస్తున్న వైకాపా నేతలకు కేవలం బీజేపీ మాత్రమే ఏకైక దిక్కుగా మారింది. 
 
ఇదిలావుంటే, వైకాపాకు ప్రస్తుతం ఏడుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. వీరిలో ముగ్గురు లేదా నలుగురు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే, వారు పదవులకు రాజీనామా చేసేందుకు ఏమాత్రం ఇష్టపడటం లేదు. తన పదవులకు ఢోకా లేకుండా చూస్తే పార్టీ మారేందుకు సిద్ధమని వారు సూచన ప్రాయంగా వెల్లడించారు. అది వీలుపడకపోతే రాజీనామా చేస్తామని, తిరిగి తమనే మళ్లీ ఎన్నుకునేలా చూడాలన్న షరతు విధిస్తున్నారు. దీనికి కమలనాథులు ఏమాత్రం ఇష్టపడటం లేదు. 
 
ఈ నేపథ్యంలో వైకాపాకు చెందిన మొత్తం రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరితే ఎలాంటి ఇబ్బందులు రావని ఆలోచన చేస్తోంది. ఇందుకోసం రాజ్యసభలో వైకాపా పక్షాన్ని ఏకంగా బీజేపీలో విలీనం చేయాలని భావిస్తుంది. ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా వేసిన ఈ ఎత్తు ఎవరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాల్సివుంది.