1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 19 నవంబరు 2021 (10:31 IST)

వివేకా హత్య కేసు : ప్రధాన అనుచరుడు అరెస్టుతో ఉలిక్కిపడిన వైఎస్ అవినాష్

తన ప్రధాన అనుచరుల్లో ఒకరైన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని సీబీఐ అధికారులు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అరెస్టు చేశారు. ఈ కేసులో మరో నిందితుడైన దస్తగిరి ఇచ్చిన నేరంగీకార పత్రంలో పలువురు పేర్లను వెల్లడించారు. వీరిలో శివశంకర్ రెడ్డి కూడా ఒకరు. దీంతో సీబీఐ ఆయన్ను హైదరాబాద్ నగరంలో అరెస్టు చేసి, పులివెందులకు తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచింది. ఆ తర్వాత ఆయనకు 14 రోజుల పాటు జ్యూడిషిల్ రిమాండ్ విధించింది. 
 
ఇదిలావుంటే, కడప ఎంపీగా ఉన్న అధికార పార్టీకి చెందిన వైఎస్ అవినాశ్ రెడ్డి పులివెందుల కోర్టుకు వచ్చారు. వైఎస్ వివేకా హత్య కేసు వెనుక అనేక పెద్దల హస్తమున్నట్టు దస్తగిరి వెల్లడించారు. అదేసమయంలో శివశంకర్ రెడ్డి అరెస్టుతో అవినాశ్ రెడ్డి ఆందోళనకుగురైనట్టు తెలుస్తోంది.
 
దీంతో ఆయన్ను కోర్టుకు తీసుకొచ్చినపుడు అవినాశ్ కోర్టు ప్రాంగణంలో కలిశారు. ఆ తర్వాత శివశంకర్ రెడ్డితో ప్రత్యేకంగా అరగంట పాటు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీబీఐ అధికారులకు ఆయనకు మధ్య స్వల్ప వాగ్వివాదం కూడా జరిగినట్టు తెలుస్తోంది. అలాగే, వైకాపా శ్రేణులు కూడా భారీ స్థాయిలో కోర్టు ప్రాంగణం వద్దకు చేరుకుని హడావుడి చేయడం గమనార్హం. సీబీఐ అధికారుల వాహనాలను సైతం అడ్డుకునే ప్రయత్నం చేశారు.