1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

వైఎస్. వివేకా హత్య కేసు : సూత్రధారులు ఆ నలుగురేనా?

వైకాపా సీనియర్ నేత, మాజీ మంత్రి వైఎస్. వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన సూత్రధారులు ఆ నలుగురుగా తెలుస్తోంది. ముఖ్యంగా, ఎర్ర గంగిరెడ్డి, యాదటి సునీల్ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డి, షేక్ దస్తగిరి పాత్ర ఉన్నట్టు గత నెల 27న కోర్టుకు సమర్పించిన ప్రాథమిక చార్జ్‌షీట్‌లో సీబీఐ పేర్కొన్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో గజ్జల ఉమాశంకర్ రెడ్డికి బెయిల్ ఇవ్వలేమని కోర్టు అభిప్రాయపడింది. 
 
వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడు గజ్జల ఉమాశంకర్‌రెడ్డి పాత్రపై సీబీఐ స్పష్టమైన ప్రకటన చేసింది. ఈ కేసులో ఆయన పాత్రకు సంబంధించిన ఆధారాలు ఉన్నట్టు పేర్కొంది. హత్య జరిగిన రోజు తెల్లవారుజామున 3.15 గంటల సమయంలో ఉమాశంకర్‌రెడ్డి రోడ్డుపై పరుగులు తీస్తున్నట్టు వివేకా ఇంటి సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయినట్టు కోర్టుకు సమర్పించిన కౌంటర్‌లో తెలిపింది. 
 
ఈ ఫుటేజీని గుజరాత్‌ గాంధీనగర్‌లోని ఫోరెన్సిక్ సైన్స్ డైరెక్టర్, బెంగళూరులోని ఫిల్మ్ ఫ్యాక్టర్‌కు పంపామని, అలాగే, స్వతంత్ర సాక్షులు, వ్యక్తుల సమక్షంలో ఉమాశంకర్ పరుగును రికార్డు చేశామని పేర్కొంది. రెండు పరుగులకు సారూపత్య ఉన్నట్టు ఫోరెన్సిక్ ల్యాబ్, ఫిల్మ్ ఫ్యాక్టర్ అభిప్రాయపడినట్టు సీబీఐ పేర్కొంది.
 
ఉమాశంకర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై శనివారం కడపలోని ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక సెషన్స్ కోర్టులో విచారణ జరిగింది. దీనిపై కౌంట్ దాఖలు చేసిన సీబీఐ పై విషయాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. వివేకా హత్య కేసులో కుట్ర కోణం తేల్చేందుకు తదుపరి విచారణ కొనసాగించాల్సిన అవసరం ఉందని, ఈ నేపథ్యంలో ఇప్పుడు బెయిల్ ఇవ్వలేమని న్యాయస్థానం తేల్చి చెప్పింది.