1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

చంద్రబాబుకు స్వాగత ర్యాలీలో వైకాపా కార్పొరేటర్ భర్త చేతివాటం.. చితక్కొట్టుడు...

thieves
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్టయిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మధ్యంతర బెయిల్‌పై రాజమండ్రి జైలు నుంచి బయటకు వచ్చారు. ఆయనకు టీడీపీ నేతలు, శ్రేణులు భారీ ఎత్తున స్వాగతం పలికారు. ఇదే అదునుగా భావించిన అధికార వైకాపాకు చెందిన మహిళా కార్పొరేటర్ భర్త... తన చేతివాటాన్ని ప్రదర్శించారు. టీడీపీ కార్యకర్తల జేబులు కొట్టేసే పనిలో నిమగ్నమయ్యాడు. దీన్ని గమనించిన టీడీపీ నేతలు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని చితకబాది.. పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన విజయవాడ బెంజి సర్కిల్‌లో జరిగింది. 
 
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ 47వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ గోదావరి గంగ భర్త గోదావరి బాబు డివిజన్ స్థాయి వైసీపీ నాయకుడు. మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావుకు అనుచరుడు. బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు చంద్రబాబు కాన్వాయ్ బెంజి సర్కిల్‌కు చేరుకున్న సమయంలో విజయవాడకు చెందిన టీడీపీ అభిమాని శ్రీనివాస్ ఆ ర్యాలీని వీడియో తీస్తున్నాడు. అదేసమయంలో ముఖానికి ముసుగు కట్టుకున్న వ్యక్తి శ్రీనివాస్ జేబులో నుంచి రూ.20 వేలు చాకచక్యంగా కొట్టేశాడు. ఎవరో చేయి పెట్టినట్టు అనిపించి శ్రీనివాస్ వెంటనే జేబు చూసుకోగా నగదు కనిపించ లేదు. చుట్టుపక్కల చూడగా జనం మధ్య పారిపోతున్న వ్యక్తి కనిపించాడు. అతన్ని పట్టుకుని ముసుగు తీయగా.. అక్కడే ఉన్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు అతన్ని గోదావరి బాబుగా గుర్తించారు. 
 
చోరీచేసిన డబ్బుల కోసం నిలదీయగా తాను తీయ లేదని బాబు బుకాయించాడు. జేబులు తనిఖీ చేసినా నగదు కనిపించలేదు. చోరీ చేసిన మొత్తాన్ని తన అనుచరులకిచ్చి పంపించివేశాడని నిర్ధారించుకుని అతనికి దేహశుద్ధి చేసి అక్కడే ఉన్న పోలీసులకు అప్పగించారు. శ్రీనివాస్ అతనిపై ఫిర్యాదు చేశారు. పోలీసులు అతన్ని కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బాబును పోలీసులు తీసుకెళ్లిన తర్వాత కొంతమంది టీడీపీ కార్యకర్తలు తమ పర్సులు, ఏటీఎం కార్డులు, డబ్బులు కూడా పోయాయని లబోదిమన్నారు.