బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 6 డిశెంబరు 2022 (14:50 IST)

శ్రీకాకుళంలో వైకాపా నేత దారుణ హత్య.. కత్తితో నరికి చంపేశారు..

murder
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా గార మండలంలో అధికార వైకాపాకు చెందిన నేత ఒకరు దారుణ హత్యకు గురయ్యాడు. ఆయన పేరు రామశేషు. గార మండల పరిషత్ ఉపాధ్యక్షుడుగా కొనసాగుతున్నారు. ఈయనను గుర్తు తెలియని వ్యక్తులు కొందరు కత్తితో నరికి చంపేశారు. ఈయనపై గత 2017లో ఓసారి హత్యాయత్నం జరిగింది. ఈయన ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు అత్యంత సన్నిహితుడు కావడం గమనార్హం. 
 
ఈ నేపథ్యంలో మంగళవారం తెల్లవారుజామున దుండగులు పక్కా ప్లాన్‌తో హత్య చేశారు. ఈ ఘటన జిల్లాలోని గార మండల శ్రీకూర్మం గ్యాస్ గోదాము వద్ద జరిగింది. ఈయన స్థానికంగా గార మండల పరిషత్ ఉపాధ్యక్షుడుగా కొనసాగుతున్నారు. స్థానికుల సమచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. దుండగులు హత్యకు ఉపయోగించిన కత్తులను సమీపంలోని పొలాల్లో పడేసి వెళ్లిపోయారు. 
 
అయితే, దుండగులు మొబైల్ ఫోన్‌ను కూడా వదిలేసి వెళ్లడంతో ఇది ఖచ్చితంగా దొంగల పని కాదని పోలీసులు భావిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యావహారాలు, వివాహేతర సంబంధాల కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు. ఈ హత్యలో ముగ్గురు దుండగులు పాల్గొనివుండొచ్చని అనుమానిస్తున్నారు.