1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 5 ఏప్రియల్ 2021 (10:41 IST)

సీఎం జగన్‌కు బెయిల్ రద్దు భయం పట్టుకుంది.. అందుకే పప్పుబెల్లాలు... : వైకాపా ఎంపీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోన్ రెడ్డికి బెయిల్ రద్దు భయంపట్టుకుందని ఆ పార్టీకి చెందిన రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆరోపించారు. అందుకే రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి అనర్హులకు కూడా సంక్షేమపథకాల పేరుతో పప్పుబెల్లాలను పంచిపెడుతున్నారని ఆరోపించారు. 
 
ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, తన బెయిల్‌ రద్దయి జైలుకు పోతానన్న భయం జగన్‌కు పట్టుకుందన్నారు. అందుకే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైనప్పటికీ జగన్ ఏమాత్రం పట్టించుకోకుండా, అపరిమితమైన అప్పులు చేసి ప్రజల మెప్పు కోసం సంక్షేమం ముసుగులో పప్పుబెల్లాలు పంచిపెడుతున్నారని ఆరోపించారు. 
 
ఒకవేళ తాను జైలుకు వెళ్తే... జగన్‌ జైల్లో ఉన్నందువల్లే పథకాలు అందడం లేదని ప్రజలు అనుకోవాలని భావిస్తున్నారని రఘురామకృష్ణంరాజు తెలిపారు. ‘అనర్హులకు కూడా విచ్చలవిడిగా సంక్షేమాన్ని అమలు చేయడం కేవలం ఓట్ల రాజకీయం కోసమే. సంపద సృష్టించకుండా ఖజానాను కొల్లగొడుతూ, రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడం సమంజసం కాద’ని విరుచుకుపడ్డారు. 
 
అస్తవ్యస్త విధానాలతో ప్రభుత్వోద్యోగులకు జీతాలు చెల్లించలేని దుస్థితి రావడం బాధాకరమన్నారు. 3.6 లక్షల మంది పింఛనుదారులకూ ఎదురుచూపులు తప్పడం లేదన్నారు. సంక్షేమం పేరుతో ఖజానా లూటీ చేసి ఉద్యోగులకు జీతాలివ్వరా అని ప్రశ్నించారు. ఇవే పరిస్థితులు కొనసాగితే రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రం ఆందోళనకరంగా ఉంటుందని రఘురామకృష్ణంరాజు తెలిపారు.